కుందుర్పి: మండలంలోని తెనగల్లు గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. మాజీ సర్పంచ్ చెన్నరాయుడు, ఆయన భార్య, మాజీ ఎంపీటీసీ గవిసిద్ద భార్య కమలమ్మ, గత ఏడాది పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్ రాధమ్మ భర్త శ్రీనివాసులు, టీడీపీ నాయకుడు వెంటేశులు భార్య కవిత, కల్యాణ్ భార్య దీపతో పాటు మరో 56 మంది 2 నెలలుగా ఒక్క రోజు కూడా పనులకు వెళ్లకున్నా ఖాతాల్లో బిల్లులు జమయ్యాయి. మొత్తంగా రూ.8 లక్షలు అక్రమంగా జమైనట్లు తెలుస్తోంది. దీనిపై మండల వైఎస్సార్సీపీ నాయకులు, తెనగల్లు గ్రామస్తులు బుధవారం ఆ శాఖ పీడీ సలీంతో పాటు స్థానిక ఎంపీడీఓ లక్ష్మీశంకర్కు ఫిర్యాదు చేశారు. బోగస్ బిల్లులను రికవరీ చేయని పక్షంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎంపీడీఓ లక్ష్మీశంకర్ మాట్లాడుతూ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు బోగస్ బిల్లులను రికవరీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగరాజు, మండల కన్వీనర్ రాయుడు, వాల్మీకి మాజీ డైరెక్టర్ పాలాక్షి, మాజీ సింగిల్విండో అధ్యక్షుడు వన్నూర్రెడ్డి, సర్పంచులు తిప్పేస్వామి, లింగప్ప, చేనేత విభాగం డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ లింగప్ప, దివాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


