ఉరవకొండ: స్థానిక గవిమఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవరాజేంద్రస్వామినే అధికారికంగా పీఠాధిపతిగా నియమించాలని కర్ణాటక, తెలుగు రాష్ట్రాల మఠం భక్తులు, వీరశైవ, జంగమ, లింగాయత్ సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. శనివారం స్థానిక గవిమఠం ఆవరణంలో విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. గవిమఠానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రాతినిధ్యం లేని కల్యాణ స్వామి ఒక చట్టబద్ధత లేని నామినేషన్ డీడ్ను చూపుతూ తానే ఉత్తరాధికారి అంటూ అసత్య ప్రచారాలు చేస్తూ కరిబసవరాజేంద్రస్వామి విధులకు ఆటంకం కల్గిస్తున్నాడన్నారు. పరిపాలన వ్యవహారాలు, కార్యక్రమాల్లో తలదూర్చి, వివాదాలు సృష్టిస్తూ మఠం ప్రతిష్టను దిగజారుస్తున్నాడన్నారు. 1975లోనే గవిమఠం పీఠాధిపతులు శివైక్య చెన్నబసవరాజేంద్రస్వామి, మఠం ఉత్తరాధికారిగా కరిబసవస్వామిని చేసేందుకు నామినేషన్ డీడ్ రాసి చట్టబద్ధంగా ఆమోదం కోసం దేవదాయ శాఖ కమిషనర్కు పంపగా, కమిషనర్ ధ్రువీకరించి 2005 జనవరి 1 నుంచి మఠం ఉత్తరాధికారిగా కరిబసవరాజేంద్రస్వామిని నియమించారన్నారు. అయితే, మఠం పీఠాధిపతుల వద్ద కల్యాణస్వామి ఉత్తరాధికారిపై తప్పడు ప్రచారం చేసి దురుద్దేశంతో నామినేషన్ డీడ్ రాయించుకుని కమిషనర్ వద్దకు ఆమోదం కోసం పంపాడన్నారు. ఆ నామినేషన్ను కమిషనర్ ఆమోదించకుండా, ధార్మిక పరిషత్ ఆదేశాల మేరకు మఠం విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గవిమఠం ఉత్తరాధికారిగా కరిబసవరాజేంద్రస్వామే కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అధికారిక ఉత్తర్వులతో కొనసాగుతున్న ఉత్తరాధికారి విధులకు ఆటంకం కల్గిస్తున్న కల్యాణస్వామిపై ధార్మిక పరిషత్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


