● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, మాజీ మంత్రి శైలజానాథ్
అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించి సత్తా చాటాలని జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. శనివారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శింగనమల నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం శైలజా నాథ్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు అనంత హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నాయకుడు ఒక్కరే గెలిస్తే అది విజయం కాదని, కార్యకర్త గెలిస్తేనే పార్టీ గెలిచినట్టని, పార్టీ గెలిస్తేనే ప్రజల గొంతు బలపడుతుందని అన్నారు. ప్రతి నాయకుడు తన పరిధిలోని గ్రామాలలో బాధ్యత తీసుకోవాలన్నారు. స్థానిక సమస్యలను గుర్తించాలని, వాటిపై అధికారులను ప్రశ్నించాలని, అవసరమైతే ఉద్యమించాలని కోరారు.
జెడ్పీ పీఠం సాధించాలి
శింగనమల నియోజకవర్గంలోని ఆరు జెడ్పీటీసీ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలవడంతో పాటు జిల్లాపరిషత్ అధ్యక్షపీఠం సాధించాలని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ సూచించారు. జెడ్పీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాన్ని తీసిన చోటే.. సగౌరవంగా నిలువెత్తు చిత్రపటం పెట్టాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే పదవుల కోసం జరిగే ఎన్నికలు కాదని, గ్రామాల్లో ప్రజలతో ఎవరు ఉన్నారు.. ప్రజల కష్టాల్లో ఎవరు నిలబడ్డారు.. ప్రజల సమస్యల కోసం ఎవరు పోరాడారు? అనే దానికి ప్రజలు ఇచ్చే తీర్పు అని స్పష్టం చేశారు.
పార్టీ నిర్ణయమే శిరోధార్యం
‘స్థానిక’ అభ్యర్థుల ఎంపిక విషయంలో వైఎస్సార్సీపీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని గుంతకల్లు సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి అన్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం చాలా ముఖ్యమన్నారు. అభ్యర్థి ఎవరైనా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి అందరూ కలిసి పనిచేయాలన్నారు. శింగనమల నియోజకవర్గ పరిశీలకుడు ఎల్ఎం మోహన్రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్తనూ కలుపుకొని ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గువ్వల శ్రీకాంత్రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండ్లపల్లి ప్రతాప్రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, నాయకులు గార్లదిన్నె నారాయణరెడ్డి, బొమ్మన శ్రీరాంరెడ్డి, వంశీ గోకుల్రెడ్డి, భోగాతి ప్రతాపరెడ్డి, శ్రీకాంత్రెడ్డి, ఎల్లారెడ్డి, గువ్వల శ్రీకాంత్రెడ్డి, మహేశ్వరరెడ్డి, ఖాదర్ వలిఖాన్, నాయకులు మంజునాథ్, శ్రీనివాసులు నాయక్, అంకె ముసలన్న, కల్లూరు సూర్యనారాయణ, ఎం నాగేశ్వరరెడ్డి, జయరాం రెడ్డి, ఆదినారాయణ, బోనాల హరికృష్ణ, శ్యాంసుందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, నూర్ మహమ్మద్ విష్ణు నారాయణ, రమణయ్య, తదితరులు పాల్గొన్నారు


