అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా చేపట్టిన ఓటరు నమోదు, ఓటు తొలగింపు, వివరాల మార్పునకు సంబంధించి దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. దరఖాస్తులు, అభ్యంతరాలను అక్టోబరు 5వ తేదీలోపు పరిష్కరిస్తారు. అక్టోబరు 9వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రచురిస్తారు. ఈ ఏడాది మే నుంచి ఇప్పటి వరకు కొత్తగా ఓటరు నమోదుకు (ఫారం–6) 27,766 దరఖాస్తులు అందగా ఇప్పటి వరకు 12,485 పరిష్కరించారు. 15,281 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉంది. ఓటు తొలగింపునకు (ఫారం–7) 2,50,558 దరఖాస్తులు రాగా 2,50,219 పరిష్కరించారు. 369 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. ఓటు వివరాల మార్పునకు 20,181 దరఖాస్తులు అందగా 12,005 పరిష్కరించారు. 8,176 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉంది. వీటన్నింటినీ అక్టోబరు 5వ తేదీలోపు పరిష్కరిస్తారు.
మొక్కుబడిగా ఓటరు నమోదు..
18 ఏళ్లు నిండిన యువతను ఓటరుగా నమోదు చేయాలనేది ఎన్నికల కమిషన్ ప్రధాన లక్ష్యం. కళాశాలలు, సంక్షేమ వసతి గృహాలను సందర్శించి 18 ఏళ్లు నిండిన యువతను ఓటరుగా నమోదు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో 18 ఏళ్లు దాటిన యువత 1.20 లక్షలు ఉన్నట్లు అంచనా. ఈ ఏడాది మే నుంచి గురువారం వరకు ఓటరు నమోదుకు 27,766 దరఖాస్తులు అందాయి. వీటిలోనూ 18 ఏళ్లు నిండిన యువత మాత్రమే కాకుండా ఇతరులూ ఉన్నారు. దీన్ని బట్టి యువతను ఓటరుగా నమోదు చేయడంపై జిల్లా ఎన్నికల యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ వహించలేదనే విషయం స్పష్టమవుతోంది.
అక్టోబరు 5 వరకు పరిశీలన
ఓటర్ల తుది జాబితా
అక్టోబరు 9వ తేదీన ప్రచురణ


