ద్వారకా తిరుమల: చాయ్ బిస్కెట్ ఫుడ్జోన్లో జరిగిన గొడవ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. తోటి కార్మికుడు కత్తితో పొట్టలో పొడవడంతో తీవ్రంగా గాయపడిన కోనెటి గంగాధరరావు (35) చికిత్స అనంతరం విశ్రాంతి పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్లో ఈనెల 8న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన గంగాధరరావు, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుణ్ణంపల్లికి చెందిన ఏలూరు శివశంకర్ లక్ష్మీనగర్లో జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ చాయ్ బిస్కెట్ ఫుడ్ జోన్లో పనిచేస్తున్నారు. వీరి మధ్య చిన్నపాటి మనస్పర్థలు రావడంతో 15 రోజులుగా గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో ఈనెల 8న రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఆ సమయంలో శివశంకర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో గంగాధరరావును పొట్టలో పొడిచి పరారయ్యాడు. వెంటనే ఫుడ్ జోన్ యజమాని భలే విజ్ఞేశ్వరరావు గాయపడిన గంగాధరరావును నల్లజర్లలోని పీహెచ్సీకి తరలించగా వైద్యులు చికిత్స అందించి మూడు కుట్లు వేశారు. అనంతరం అతడిని ఫుడ్ జోన్లోని రెస్ట్ రూమ్కు తరలించారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం పరిస్థితి విషమించడంతో గంగాధరరావు మృతి చెందాడు. భీమడోలు సీఐ పి.కృష్ణ, ద్వారకా తిరుమల ఎస్ఐ టి.సుధీర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.


