● వేధిస్తే క్రిమినల్ కేసు నమోదు చేయండి
● అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశం
అనంతపురం న్యూ టౌన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీరామరెడ్డి తాగునీటి సరఫరా ప్రాజెక్టు కార్మికులను వేధిస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టి.. నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 20 నుంచి సమ్మెలోకి వెళతామని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఏటీఎం నాగరాజు, శ్రీరామరెడ్డి తాగునీటి పథకం వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎర్రిస్వామి, వన్నూరుస్వామి సోమవారం కలెక్టర్ ఆనంద్ను కలిసి నోటీసు అందజేశారు. శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ట్రంక్లైన్ ఫేజ్–1 కార్మికులకు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదని, 2025 సంవత్సరానికి సంబంధించి ఒక్కొక్కరికి రూ. 22 వేలు బకాయిలు పెట్టారని, 40 నెలల పీఎఫ్ సొమ్ము జమ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని నోటీసులో పేర్కొన్నారు. ట్రంక్లైన్ ఫేజ్–4లో పనిచేసే కార్మిక కార్మికులకు 11 నెలల జీతంతో పాటు 11 నెలల పీఎఫ్ నిధులను జమ చేయకుండా కాంట్రాక్టర్ ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. సమ్మె నోటీసుపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసులు, కార్మిక శాఖ ఉప కమిషనర్ లక్ష్మీనారాయణలను పిలిపించుకొని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిబంధనల మేరకు పనిచేయకుండా కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంట్రాక్టర్లను వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. వేధింపులకు గురిచేస్తున్న కాంట్రాక్టర్లపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఒకవేళ అలా చేయకుండా కాంట్రాక్టర్లతో కుమ్మకై ్క కార్మికుల కడుపు కొట్టే చర్యలకు పాల్పడితే మీపై చర్యలు తీసుకుంటానంటూ అధికారులను హెచ్చరించారు.


