గుత్తి: నెల రోజులుగా తాగునీటిని సరఫరా చేయడం లేదంటూ ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కిన ఘటన బుధవారం గుత్తిలో చోటు చేసుకుంది. పట్టణంలోని జంగాల కాలనీ, బుడ బుక్కల కాలనీలకు నెల రోజులుగా మున్సిపల్ అధికారులు తాగునీటిని సరఫరా చేయలేదు. దీంతో ఆగ్రహించిన మహిళలు ఖాళీ బిందెలను చేత పట్టుకుని తాడిపత్రి రోడ్డులో బైఠాయించారు. రాస్తారోకోతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆందోళనకారులకు సర్దిజెప్పడానికి ప్రయత్నించగా.. సమస్యను పరిష్కరించే దాకా ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. ఎస్ఐ అమీర్ ఖాన్, పోలీసులతో వాగ్వాదం చేశారు. మున్సిపల్ అధికారులు తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.


