ఉరవకొండ:వారం వ్యవధిలోనే తమ స్నేహితులను కోల్పోవడం వారిని తీవ్రంగా కలచివేసింది. ఈ క్రమంలోనే వారిలో ఆలోచన మొదలైంది. ఇకపై మత్తు పదార్థాల కారణంగా ఏ ఒక్క ప్రాణమూ పోకుండా చూడాలని సంకల్పించారు. అనుకున్నదే తడువుగా మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అందరిలో అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఫ్లెక్సీ రూపొందించి పలు చోట్ల ఏర్పాటు చేయడమే కాకుండా కరపత్రాలు పంచడం, చైతన్యం కల్పించడం తదితర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఉరవకొండ పట్టణంలోని ఇందిరా నగర్కు చెందిన బషీర్, మరికొందరు యువకులతో కలిసి చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం అందరినీ ఆలోచింపజేస్తోంది. పట్టణ ప్రజలు వారిని అభినందిస్తున్నారు.


