అనంతపురం సిటీ: జిల్లా వ్యాప్తంగా ఆర్ఎంపీ, పీఎంపీలకు కమీషన్ల ఎర వేస్తూ కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు అక్రమ దందా కొనసాగిస్తున్నాయి. రోగి ఆస్పత్రిలో చేరితే యాజమాన్యాలకు పండుగే అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. మరోవైపు హాస్పిటల్కు అనుబంధంగా సొంతంగా మెడికల్ షాపులు నిర్వహిస్తున్నాయి. తమకు ఎక్కువ లాభం ఉండే మందులను కనీసం ఐదు నుంచి పది రకాలు రాస్తూ అక్రమార్జనకు తెరలేపారు. రోగికున్న జబ్బుకు అవసరమున్నా... లేకున్నా రాసేస్తున్న పలు రకాల మందుల బిల్లులు రూ.వేలల్లో ఉండడం గమనార్హం.
ఆఫర్ల ముసుగులో రోగుల జేబుకు చిల్లు
ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యులు రాస్తున్న మందులు వారి మెడికల్ షాప్లో తప్ప మరెక్కడా లభ్యం కాకపోవడం గమనార్హం. అవసరం ఉన్నా.. లేకున్నా పదుల సంఖ్యలో మందులు రాయడంతోపాటు సొంత మెడికల్ షాపుల్లోనే కొనుగోలు చేయాలనే డిమాండ్తో రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆర్ఎంపీలు సైతం మెడికల్ షాప్ నిర్వాహకులతో కుమ్మకై కమీషన్ల కోసం మోతాదుకు మించి మందులు రాస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గిఫ్ట్లు, విదేశీ టూర్, కమీషన్లు అంటూ మందుల విక్రయాలపై ఫార్మా కంపెనీలు ఇస్తున్న ఆఫర్లే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో కంపెనీలు ఇచ్చిన టార్గెట్ మేరకు మందులు, సిరప్లు, సూదిమందులను రాస్తున్నారు. అయితే వీటితో ఫలితం లేకపోవడంతో రెండు, మూడు రోజుల చికిత్స అనంతరం పరిస్థితి విషమించిందని కర్నూలు, బెంగళూరుకు రెఫర్ చేస్తున్నారు. ఇక్కడ కూడా తమ ఆస్పత్రి అంబులెన్స్లనే పంపుతూ మరో దోపిడీకి తెరలేపుతున్నారనే ఆరోపణలుఉన్నాయి.
ఇంటిల్లిపాది వాడాలని..
విజయవాడలోని ఓ విద్యాసంస్థ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న మా కొడుకు గత వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చాడు. అప్పటికే దురదతో చాలా ఇబ్బంది పడుతుండడంతో మాకు తెలిసిన ఓ ఆర్ఎంపీ తెలిపిన ప్రముఖ చర్మవైద్య నిపుణుడి వద్దకు పిలుచుకెళ్లాను. అక్కడి డాక్టర్ కొన్ని మందులు రాసి, మొత్తం ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ వాడాల్సిందేనని, లేకపోతే వ్యాధి నయం కాకుండా తిరగబెడుతూ ఉంటుందని భయపెట్టారు. దీంతో రూ.5 వేలకు పైగా ఖర్చు పెట్టి మందులు కొనుగోలు చేసి ఇంట్లో ఉన్న ముగ్గురమూ వాడాం. నాలుగు నెలలు గడిచినా ఇప్పటికీ కొన్ని రకాల మందులు, నాలుగు ఆయింట్మెంట్లు సీల్ కూడా తీయనివి మా ఇంట్లోనే ఉన్నాయి. అవసరానికి మించి ఎక్కువ మందులు రాశారనేందుకు ఇంతకన్నా ఉదాహరణ మరొకటి ఉండదు.
– రామసుబ్బయ్య, వ్యాపారి, అనంతపురం
జిల్లాలో పలు ప్రైవేట్ ఆస్పత్రులు మెడికల్ మాఫియాకు తెరలేపాయి. రోగుల ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందినకాడికి దోచుకుంటున్నాయి. ప్రత్యేకంగా పీఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆయా హాస్పిటళ్లకు రోగులను తరలించుకుంటున్నాయి.
జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల దందా
మాఫియాగా మారిన యాజమాన్యాలు
ఆర్ఎంపీ, పీఎంపీలకు కమీషన్లు
సొంతంగా మెడికల్ షాపుల
నిర్వహణతో దోపిడీ


