ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో కళకళలాడుతున్న టీబీ డ్యాం, ఆంధ్ర సరిహద్దు రెగ్యులేటర్ వద్ద గేట్లు బంద్ చేసిన దృశ్యం
బొమ్మనహాళ్: ఎగువన మలెనాడు, శివమొగ్గ, ఆగుంబే, శృంగేరి, చిక్మగళూరు, వరనాడులో భారీ వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర జలాశయానికి వరద శరవేగంగా వస్తోంది. సోమవారం 0,705 క్యూసెక్కులున్న ఇన్ఫ్లో మంగళవారం సాయంత్రానికి 1,00,895 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ఒక్కరోజులోనే పది టీఎంసీల రావడంతో డ్యాంలో నీటిమట్టం 53.65 టీఎంసీలకు చేరుకుంది. వరద పోటెత్తుతుండటంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జలాశయం నుంచి 1,447 క్యూసెక్కుల నీటిని హెచ్చెల్సీ, ఎల్ఎల్సీ, రాయబసవన కెనాల్కు విడుదల చేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి 1626.06 అడుగుల నీటి మట్టంతో 80 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. 24,130 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 23,669 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉండేదని అధికారులు తెలిపారు.
ఆంధ్ర సరిహద్దులో
తుంగభద్ర జలాల నిలిపివేత
తుంగభద్ర జలాశయం నుంచి ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కి విడుదల చేసిన నీళ్లు మంగళవారం వేకువజామున ఆంధ్రా సరిహద్దు 105–272 కిలోమీటర్ రెగ్యులేటర్ వద్దకు చేరుకున్నాయి. హెచ్చెల్సీ జిల్లా అధికారుల నుంచి ఆంధ్రాకు ఇండెంట్ సమర్పించలేదు. దీంతో కర్ణాటక హెచ్చెల్సీ అధికారులు మంగళవారం ఆంధ్రా సరిహద్దు 105వ కిలోమీటర్ వద్ద ఉన్న రెగ్యులేటర్ గేట్లను కిందకు దింపి నీటిని బంద్ చేశారు. హెచ్చెల్సీలో మరమ్మతులు జరుగుతుండటంతో ఆంధ్రాకు ఇండెంట్ నీటిని ఈ నెల 10 నుంచి తీసుకోనున్నట్లు హెచ్చెల్సీ అధికారులు చెబుతున్నారు. అది కూడా తాగునీటి అవసరాల కోసం సరిహద్దులో 1,500 క్యూసెక్కుల నీటిని తీసుకోవాలన్న ఇండెంట్ను టీబీ బోర్డుకు పంపిన్నట్లు ఆంధ్ర హెచ్చెల్సీ అధికారులు తెలిపారు.
ఒక్క రోజులోనే 10 టీఎంసీల నీరు రాక
1,00,895 క్యూసెక్కుల ఇన్ఫ్లో
53.65 టీఎంసీలకు చేరిన నీరు


