అనంతపురం కల్చరల్: జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య సర్వసభ్య సమావేశం జిల్లా కేంద్రంలోని సమాచార కేంద్రంలో ఆదివారం జరిగింది. శ్రీనివాసుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన సీఏపీసీఓ చైర్మన్ సురేష్కుమార్ మాట్లాడుతూ ఇన్నిరోజులుగా అధ్యక్షుడిగా వ్యవహరించిన రవీంద్రనాథరెడ్డి, కోశాధికారి సుబ్రమణ్యం, ప్రధాన కార్యదర్శి నబీరసూల్ ముగ్గురూ ఒకే ఏడాదిలో మరణించడం సమాఖ్యకు తీరని లోటని సంతాపం తెలియజేశారు. వారి స్థానాలలో నూతన సభ్యులను ఎన్నుకున్నట్లు వెల్లడించారు. వినియోగదారుల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమన్నారు. హక్కుల పరిరక్షణ, అవగాహన కార్యక్రమాల విస్తరణతో పాటు జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య బలోపేతమే లక్ష్యంగా నూతన కార్యవర్గం పనిచేయాలని సూచించారు.
అధ్యక్షుడిగా తోట చెన్నప్ప..
అనంతరం జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడిగా తోట చెన్నప్పను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంటుగా చల్లా కిషోర్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడిగా పి.కృష్ణమూర్తి, చంద్ర మహేష్, రాయల్ కొండయ్య, కోశాధికారిగా శేషాద్రి, జాయింట్ సెక్రటరీగా హసీన్వలి, సంయుక్త కార్యదర్శిగా అశ్వత్తరెడ్డితో పాటు వివిధ మండలాల కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై తీర్మానాలు చేశారు.


