అనంతపురం సెంట్రల్: నగరంలో రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిపై నుంచి యువకుడు నగ్నంగా దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. త్రీటౌన్ సీఐ కౌలుట్లయ్య తెలిపిన మేరకు.. తాడిమర్రి మండలం రామాపురానికి చెందిన దబ్బర అశోక్ (30) తల్లిదండ్రులు గతంలోనే చనిపోయారు. అప్పటి నుంచి అతను నగరంలో ఉంటూ రైల్వే స్టేషన్ సమీపంలోని హిత మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో కమీషన్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. వివిధ ఆసుపత్రుల నుంచి రోగులను తీసుకువస్తే అతనికి ఆసుపత్రి యాజమాన్యం కమీ షన్ ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. మూడు సంవత్సరాలుగా అదే ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆసుపత్రిపై నుంచి అశోక్ నగ్నంగా కిందికి దూకాడు. తీవ్ర గాయాలైన అతడిని ఆసుపత్రి సిబ్బంది వెంటనే లోపలికి తీసుకొచ్చి చికిత్స ప్రారంభించగా.. శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. అశోక్ మృతిపై తమకు అనుమానాలున్నాయని బంధువులు ఆరోపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ప్రభుత్వాసుత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు నమోదు చేస్తామని సీఐ కౌలుట్లయ్య తెలిపారు.


