వజ్రకరూరు: మండల కేంద్రమైన వజ్రకరూరు సమీపంలోని ఉరవకొండ–గుంతకల్లు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెడుతున్నారు. దీంతో పచ్చని చెట్లు కాలిపోతున్నాయి. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్లకు కావాలనే నిప్పు పెడుతున్నారా, లేక ఇతర కారణాల వల్ల నిప్పు పెడుతున్నారా అన్నది తెలియాల్సి ఉంది. కనీసం ఇప్పటికై నా అధికారులు తక్షణమే స్పందించి ఉరవకొండ – గుంతకల్లు ప్రధాన రహదారిలో ఉన్న చెట్లను సంరక్షించేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
గొర్రెల కాపరి ఆత్మహత్య
డీ.హీరేహాళ్ (బొమ్మనహాళ్): డీ.హీరేహాళ్ మండలంలోని బాదనహాళ్ గ్రామ శివారులో గొర్రెల కాపరి బోయ శివరుద్ర (30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ గురుప్రసాద్రెడ్డి వివరాలమేరకు... శివరుద్ర గొర్రెలు మేపుతూ జీనవం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన, బాదనహాల్ రైల్వే బ్రిడ్జి సమీపంలోని పొలంలో వేపచెట్టుకు లుంగీతో ఉరివేసుకొని కనిపించాడు. విషయాన్ని గమనించిన గొర్రెల కాపరులు గ్రామస్తులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడికి ఇద్దరు కుమారైలు ఉన్నారు. మృతుడి భార్య అమృత ప్రస్తుతం గర్భిణిగా ఉన్నట్లు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బళ్లారి విమ్స్కు తరలించారు. మృతుడి తండ్రి గంగన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
అనారోగ్యంతో మహిళ ..
రాప్తాడు రూరల్: అనారోగ్యంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాప్తాడు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. పామిడి మండలం ఖాదర్పేటకు చెందిన లేట్ బుసా చంద్రశేఖర్రెడ్డి భార్య బుసా చంద్రకళ (50) ప్రస్తుతం రాప్తాడు మండలం ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటోంది. పది రోజులుగా ఆమె శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, ఆహారం కూడా సరిగా తీసుకోలేకపోతున్నారు. దీంతో కుమార్తె బుసా వీర భార్గవి, మేనత్త ఉషారాణి కలిసి వివిధ ఆస్పతుల్లో చూపించినా ఫలితం లేకపోయింది. మనస్తాపానికి గురైన చంద్రకళ శనివారం రాత్రి ఇంటి హాలులోని ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనాస్థలాన్ని ఆదివారం పరిశీలించారు. భార్గవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి మృతి
గుత్తి రూరల్: మండలంలోని అనగానదొడ్డి గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు. మండలంలోని పి.ఎర్రగుడి గ్రామానికి చెందిన కుళ్లాయప్ప (45) పని నిమిత్తం గుత్తికి వచ్చాడు. ద్విచక్ర వాహనంలో ఇంటికి తిరిగి వెళ్తుండగా అనగానదొడ్డి గ్రామ శివారులో ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుళ్లాయప్పను వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స అందించేలోపే అతను చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


