అనంతపురం ఎడ్యుకేషన్: టెట్–2026 పరీక్షలకు హాజరయ్యే ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీ (ఓడీ) సౌకర్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు కళ్యాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రిస్వామి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు శాఖాపరమైన (డిపార్ట్మెంటల్) పరీక్షలకు హాజరయ్యే సమయంలో ప్రభుత్వం ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పిస్తోందని వారు గుర్తు చేశారు. అలాగే ప్రభుత్వం నిర్వహిస్తున్న టెట్ పరీక్షలకు హాజరయ్యే ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా పరీక్ష రాసే రోజు ఓడీ మంజూరు చేయడం సముచితమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. సెలవు విషయంలో ఇబ్బంది తలెత్తకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేందుకు ప్రభుత్వం ఓడీ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
హిందూపురం: మండలంలోని అప్పలకుంట గేట్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరు గాయపడ్డారు. హిందూపురం రూరల్ పోలీసుల వివరాలమేరకు.. సంతేబిదనూరుకు చెందిన ముబారక్ (30)తో పాటు మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై తూమకుంట నుంచి హిందూపురం వైపునకు వస్తున్నారు. అయితే అప్పలకుంట గేట్ వద్ద తుఫాన్ వాహనం వేగంగా వచ్చి ఢీకొంది. ఘటనలో ముబారక్ తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన మరో వ్యక్తిని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటన ప్రదేశాన్ని హిందూపురం రూరల్ ఏఎస్ఐ శ్రీరాములు, సిబ్బంది పరిశీలించారు.


