అనంతపురం అర్బన్: రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్ అన్నారు. అభ్యర్థులు భవిష్యత్తుతో చంద్రబాబు ప్రభుత్వం చెలాగాటం ఆడుతోందని మండిపడ్డారు. ఆదివారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణలో చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. గతంలో పరీక్షల మార్కులు అందరికీ తెలిసేలా బహిరంగంగా ప్రకటించేవారన్నారు. ఇప్పుడు గోప్యంగా ఉంచడం వెనుక మతలబు వ్యవహారం కనిపిస్తోందని చెప్పారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా నియామకాలకు సంబంధించి కొత్త నిబంధనలతో జీఓలు ఇవ్వడం వెనుక కుట్ర కోణం కనిపిస్తోందన్నారు. అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించకుండా దాటవేసే ధోరణి అవలంభిస్తుండటాన్ని బట్టి చూస్తేి ఇందులో పెద్దల ప్రమేయం ఉన్నట్లుగా తెలుస్తోందన్నారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యారంగ సమస్యలపై ఆందోళన చేసిన విద్యార్థులు, యువతపైన పోలీసులు క్రూరంగా దాడి చేస్తే చంద్రబాబు ప్రభుత్వం మద్దతు తెలపకపోగా కనీసం సానుభూతి చూపకోవడం బాధకారమన్నారు. బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు చంద్రబాబు తొత్తుగా మారారనడానికి ఇదే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీరాములు, నారాయణస్వామి, లింగమయ్య, రాజేష్గౌడ్, కృష్ణుడు, అల్లీపీరా, తదితరులు పాల్గొన్నారు.


