బొమ్మనహాళ్: గోవిందవాడలో వరుణుడి కరుణ కోసం గ్రామస్తులు వినూత్న ఆచారాన్ని పాటించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని గాడిదలకు సాంప్రదాయంగా కల్యాణం జరిపించారు. అనంతరం డప్పులతో గ్రామ వీధుల్లో ఊరేగించారు. మహిళలు హారతులు ఇచ్చి గ్రామ దేవతలను వేడుకున్నారు. మంచి వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండాలని రైతుల కష్టాల తీరాలని వేడుకున్నారు. వర్షాభావ పరిస్ధితుల్లో ఇలాంటి ఆచారం పాటిస్తే వరుణుడి ప్రసన్నమై వర్షాలు కురుపిస్తాడనే పెద్దల నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన్నట్లు గ్రామస్తులు తెలిపారు.
ఉద్యోగం రాలేదని
యువకుడి బలవన్మరణం
బెళుగుప్ప: మండలంలోని దుద్దేకుంట గ్రామానికి చెందిన జి.మధు(25) ఉద్యోగం రాలేదన్న బెంగతో శుక్రవారం తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని, గొంతుకు తాడు బిగించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వరలక్ష్మి, నాగభూషణ దంపతులకు కుమార్తె యశోద, కుమారుడు మధు సంతానం. మధు ఎస్కే యూనివర్సిటీలో బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్) పూర్తి చేశాడు. రెండేళ్లుగా ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటూ ఉద్యోగ ప్రయత్నం చేసేవాడు. అయినా ఉద్యోగం రాకపోవడంతో అప్పుడప్పుడు తల్లిదండ్రులతో చెప్పుకుని తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు. ఉద్యోగం వస్తుందిలే అంటూ సర్దిచెప్పేవారు. అయితే.. తల్లిదండ్రులు శుక్రవారం ఉదయాన్నే పొలం పనులకు వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న మధు నోట్లో చేతిగుడ్డను ఉంచుకుని, తలకు ప్లాస్టిక్ కవర్ను చుట్టుకుని.. తాడుతో గొంతుకు బిగించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు పొలం పనులను ముగించుకుని ఇంటికి తిరిగొచ్చిన తర్వాత మంచంపై విగతజీవిగా పడి ఉన్న కుమారుణ్ని చూసి గుండెలవిసేలా రోదించారు. ఉద్యోగం రాలేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడని, మరే ఇతర కారణాలు లేవని మృతుడి తండ్రి నాగభూషణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని హెడ్ కానిస్టేబుల్ వన్నూరుస్వామి తెలిపారు.


