అనంతపురం క్రైం: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్–2026) ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఓ. ఆనంద్ అధికారులను ఆదేశించారు. ఓటు హక్కు కలిగిన ఏ ఒక్క అర్హుడు జాబితా నుంచి తప్పిపోకుండా క్షేత్రస్థాయిలో పక్కా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా మునిసిపల్ కమిషనర్తో కలసి ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. 14వ తేదీలోగా పనులు పూర్తి చేయాలన్నారు. నగరంలోని 45వ వార్డు పరిధిలోని 168, 169, 170, 171 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లను కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
15.90 లక్షల ఈఎఫ్లు డిజిటలైజేషన్
అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాలు శుక్రవారానికి 15.90 లక్షలు డిజిటలైజేషన్ చేసినట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ స్పష్టం చేశారు. జిల్లాలో 20,38,523 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 20,35,073 మందికి (99.83 శాతం) ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశారన్నారు. వాటిలో 15,90,197 ఈఎఫ్లు (78.01శాతం) డిజిటలైజేషన్ చేశారన్నారు.
ఈఎఫ్ స్వీకరణకు ప్రత్యేక డ్రైవ్ : ఓటర్లకు అందజేసిన ఈఎఫ్లు స్వీకరణ, డిజిటలైజేషన్ కోసం శని, ఆదివారాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అధికారులు, సిబ్బందిని, ఉపాధ్యాయులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, అందరినీ భాగస్వాముల్ని చేస్తున్నామన్నారు. 2002 వివరాలు లేకపోయినా పర్వాలేదన్నారు. ఈఎఫ్లు వెనక్కు ఇవ్వని వారి ఓటు ముసాయిదా జాబితాలో ఉండదన్నారు.


