అనంతపురం ఎడ్యుకేషన్: ‘అనంత’ విద్యార్థినికి జపాన్ దేశం నుంచి పిలుపు వచ్చింది. సైన్స్లో కనబరచిన ప్రతిభకు అంతర్జాతీయ వేదికపై గుర్తింపు లభించింది. గుంతకల్లు మండలం కసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తిచేసి ప్రస్తుతం ఇడుపులపాయలో ఇంటర్ చదువుతున్న కావలి జ్యోతి తన సృజనాత్మకతతో రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. ‘సోలార్ మల్టీపర్పస్ పోర్టబుల్ టెంట్’ అనే వినూత్న నమూనాను రూపొందించిన విద్యార్థిని ప్రతిభకు గుర్తింపుగా, దేశవ్యాప్తంగా నిర్వహించిన ఇన్స్పైర్ మనక్ జాతీయస్థాయికి ఎంపిక కావడం గమనార్హం. ఈ ప్రతిభతో ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో మరొక గొప్ప అవకాశం లభించింది. జపాన్ సైన్స్, టెక్నాలజీ ఏజెన్సీ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ‘సకుర సైన్స్ ప్రోగ్రాం’ కింద ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపిక కాగా.. అందులో కావలి జ్యోతి ఒకరు ఉండడం విశేషం. ఈ కార్యక్రమం ద్వారా యువ శాస్త్రవేత్తలకు జపాన్లో సైన్స్, టెక్నాలజీ రంగాల్లో జ్ఞానాన్ని పంచుకునే అరుదైన అవకాశం లభించనుంది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేసి జ్యోతిని అభినందించారు. ప్రత్యేకంగా విద్యార్థిని మార్గదర్శకులు ఉపాధ్యాయులు నారాయణ సేవలను కొనియాడారు. ఇలాంటి ప్రతిభను వెలికితీయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు.
సైన్స్లో ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు


