● రేపటి ధర్నాకు తరలిరండి
● వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి పిలుపు
ఉరవకొండ: కరువు పీడిత జిల్లాలో పేదలకు ఆర్డీటీ సేవలు కొనసాగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ చూపి కేంద్రంతో చర్చించాలని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం ఈ నెల 9న ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలతో కలసి వైఎస్సార్సీపీ నిర్వహించబోయే మహాధర్నాపై చర్చించేందుకు శనివారం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఐదు దశాబ్దాలుగా విద్య, వైద్యం, మహిళా సాధికారత లాంటి రంగాల్లో సేవలందిస్తున్న ఆర్డీటీని కేంద్రం గుర్తించకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతి ఏటా ఆర్డీటీకి విదేశీ నిధుల ద్వారా రూ.600 కోట్లు వచ్చేవని, ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యూవల్ చేయకపోవడంతో ప్రస్తుతం ఒక్క పైసా కూడా రాలేదని తెలిపారు. దీని వల్ల ఆర్డీటీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యూవల్ చేయిస్తామని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చెప్పినా ఇప్పటి వరకూ ఎటువంటి స్పందనా లేదన్నారు. జిల్లాకు చెందిన మంత్రి కేశవ్తో పాటు ఇతర ఎమ్మెల్యేలు ఉత్సవ మూర్తుల్లా మారార విమర్శించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ అయ్యే వరకు ఆర్డీటీ సేవలు కొనసాగేందుకు ఆర్థికంగా తోడ్పాటునందించాలని కోరారు. సోమవారం నాటి ధర్నాకు స్వచ్ఛందంగా అందరూ తరలివచ్చి ఆర్డీటీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సీపీ వీరన్న, సర్పంచ్ మీనుగ లలితమ్మ, కాంగ్రెస్ నాయకులు సోనియా శీనా, అబ్బాస్, ఎస్సీ, ఎస్టీ హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మీనుగ గోపాల్, ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక నాయకులు మధు, ఎస్సీ, ఎస్టీ నాయకులు రాజశేఖర్, ఏఐఎఫ్డీఎస్ జిల్లా అధ్యక్షులు నందు, తరుణ్, వైఎస్సార్ విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు పురుషోత్తం, రైతు సంఘం అధ్యక్షులు సిద్దార్థ్, పార్టీ నాయకులు ఈడిగ ప్రసాద్, బసవరాజు, ఓబన్న, ఎర్రిస్వామిరెడ్డి, పచ్చిరవి, గంగాధర్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి


