కణేకల్లు: రైతులు పండించిన పప్పుశనగను బుధవారం నుంచి మద్దతు ధరతో కొనుగోలు చేయనున్నట్లు ఏపీ మార్క్ఫెడ్ డీఎం పెన్నేశ్వరి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ద్వారా ఏడు వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కణేకల్లు మండలంలో 23,604 ఎకరాల విస్తీర్ణంలో రైతులు పప్పుశనగ సాగు చేశారని, ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశామని చెప్పారు. రైతుకు ఎన్ని ఎకరాలున్నా గరిష్టంగా 5 ఎకరాలకు సంబంధించిన సరుకు అంటే 40 క్వింటాళ్ల వరకు కొంటామని చెప్పారు. క్వింటా కనీస మద్దతు ధర రూ.5,875తో శనగలు కొనుగోలు చేస్తామన్నారు. దళారులను నమ్మి అమ్ముకోవద్దని ఆమె సూచించారు.
మహిళలకు ఆరోగ్య పరీక్షలు
అనంతపురం సెంట్రల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని పోలీసు హెడ్క్వార్టర్స్ ఆస్పత్రిలో మహిళా పోలీసు సిబ్బంది, జీఎంఎస్కేలు, హోంగార్డులు, మహిళా ఆటో డ్రైవర్లు, డ్వాక్రా మహిళలకు వైద్య శిబిరం నిర్వహించారు. సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు ఈసీజీ, 2డీఎకో, కంటి పరీక్షలు చేశారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా, డీఎస్పీలు మహబూబ్బాషా, శ్రీనివాసరావు, నీలకంఠేశ్వరరెడ్డి, పోలీసు డాక్టర్ కౌసర్బేగం, సీఐలు వెంకటేశ్వర్లు, వెంకటేష్నాయక్, శ్రీకాంత్యాదవ్, ఆర్ఐలు పాల్గొన్నారు.
విజయవాడ వెళ్లిన కలెక్టర్
అనంతపురం అర్బన్: కలెక్టర్ ఆనంద్ మంగళవారం విజయవాడకు వెళ్లారు. సీఎం బుధవారం విజయవాడలో ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీతో నిర్వహించనున్న సమావేశంలో కలెక్టర్ పాల్గొననున్నారు. ఆయన తిరిగి 5వ తేదీ విధులకు హాజరవుతారని కార్యాలయ వర్గాలు తెలిపాయి.


