వెట్టి చాకిరీ రూపుమాపాలి
● అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశం
అనంతపురం అర్బన్: జిల్లాలో వెట్టి చాకిరీని పూర్తి స్థాయిలో రూపు మాపే దిశగా కార్యక్రమాలు అమలు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన చట్టం –1976పై సామర్థ్యం పెంపు సదస్సు జరిగింది. సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. వెట్టిచాకిరీ నిర్మూలన సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. ఈ వ్యవస్థను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ తమ పరిధిలో చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. రుణం తీసుకున్నందుకు ప్రతిఫలంగా తక్కువ వేతనం లేదా వేతనం లేకుండా బలవంతంగా పనిచేయించడం నేరమన్నారు. చట్టం ప్రకారం వెట్టిచాకిరీ కింద ఉన్న పాత అప్పులన్నీ రద్దు అవుతాయన్నారు. బాధితుడు అప్పును తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. బాధితుని ఆస్తులు ఏవైనా యజమాని వద్ద తనఖాలో ఉంటే వాటిని విడుదల చేయిస్తామన్నారు. వెట్టిచాకిరీ చేయించుకున్న యజమానులకు మూడేళ్ల జైలుశిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తారన్నారు. చట్టంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన పోస్టర్లను కలెక్టర్ విడుదల చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డీఆర్ఓ మలోల, కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ లక్ష్మీనరసయ్య, ఆర్డీఓలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు.


