చిత్రవధ
చిత్రావతి నదిలో ఇసుకను టిప్పర్లోకి నింపుతున్న దృశ్యం
యల్లనూరు: అక్రమార్కుల స్వార్థం.. అధికారుల నిర్లక్ష్యం.. వెరసి ఎడాపెడా ఇసుక తవ్వకాలు చేపట్టడంతో చిత్రావతి నది చిత్రవధకు గురవుతోంది. ప్రభుత్వం మాది.. మేం ఏం చేసినా చెల్లుతుంది అనే రీతిలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం మల్లాగుండ్ల సమీపాన లింగారెడ్డిపల్లి వద్ద సర్వేనంబరు 112లో ఇసుక రీచ్ ఏర్పాటైంది. 1.12 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ భూమిలో నిర్దేశిత క్యూబిక్ మీటర్ల మేర ఇసుక తవ్వుకోవచ్చు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలతో ఆ పార్టీకి చెందిన నేతకు రీచ్ నిర్వహణ బాధ్యతలు లభించాయి. ఆయన సదరు సర్వేనంబరులో ఇసుక తవ్వకాలు పూర్తి చేశాడు. ఆ తర్వాత దిగువనే ఉన్న చిత్రావతి నదిపై కన్నుపడింది. అంతే పరిధి దాటి అందులో పాగా వేశాడు. అక్కడ జేసీబీలు పెట్టి నిరాటంకంగా ఇసుక తవ్వకాలు చేపట్టాడు. ఇలా నదిలో ఏకంగా ఇసుక తవ్వడం నిబంధనలకు విరుద్ధమని తెలిసినా మైనింగ్ శాఖ అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఇందులో అధికార పార్టీ పెద్దల హస్తం ఉందని, తమకెందుకు గొడవ అని మిన్నకుండిపోయినట్లు సమాచారం. ఇదే అదనుగా రీచ్ నిర్వాహకుడు అడ్డదారుల్లో ఇసుక తోడేసి రూ.లక్షలు పోగేసుకున్నాడు. నది ప్రాంతంలో చిలమకూరు గ్రామ పొలాల రైతులకు సంబంధించి పది దాకా మోటార్లు ఉన్నాయి. ఇసుక తవ్వకాలు నిలుపుదల చేయాలని రైతులు అడ్డుకున్నారు. అయితే నిర్వాహకులు వారిని ఏమాత్రమూ ఖాతరు చేయలేదు. దీంతో రైతులు అధికారుల దృష్టికి తీసుకుపోయారు. కానీ ఎటువంటి ప్రయోజనమూ లేకపోయింది.
లింగారెడ్డిపల్లి ఇసుక రీచ్ నిర్వాహకులు పరిధి దాటి నదిలో ఇసుక తవ్వుతున్నారని జిల్లా అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో వారు స్పందించి విచారణ చేపట్టారు. నదిలో ఇసుక తవ్వకాలు జరిపినట్లు గుర్తించారు. నిర్వాహకులకు గత జనవరి నెలలో రూ.3.50 లక్షలు జరిమానా విధించారు. అయితే నిర్వాహకులు ఇప్పటి వరకు ఆ సొమ్ము కట్టలేదు. ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న నిర్వాహకులపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని రైతులు కోరుతున్నారు.
ఇసుక రీచ్ మాటున అక్రమాలకు తెరలేపారు. పరిధి దాటి తవ్వకాలు చేపట్టారు. భారీగా ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికార కూటమి పార్టీల ముఖ్య ప్రజా ప్రతినిధుల అండదండలతో రెచ్చిపోతున్నారు. ఓ ప్రజాప్రతినిధి అయితే తనకు కప్పం పట్టి కావలసినంత తవ్వుకోండని అభయహస్తం ఇవ్వడంతో అన‘కొండ’లా మారి ఇసుకను మింగేస్తున్నారు.
చిత్రావతి నుంచి యథేచ్ఛగా ఇసుక తరలింపు
శింగనమల నియోజకవర్గ ప్రజాప్రతినిధి అండతో కూటమి నేతల బరితెగింపు
అక్రమ తవ్వకాలు చేస్తున్నా అధికారుల మొద్దునిద్ర
కప్పం కట్టి అడ్డంగా తవ్వేసుకోమంటూ
ప్రజాప్రతినిధి పర్మిషన్!
ఫిర్యాదుల వెల్లువ..
చిత్రవధ


