బ్రాహ్మణుల ఆస్తిపై టీడీపీ నేతల కన్ను
● చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు వినతి పత్రం ఇచ్చిన బాధితులు
యాడికి: మండలంలోని రాయలచెరువు గ్రామానికి చెందిన బ్రాహ్మణుడు చాగంటి రామచంద్రయ్యకు చెందిన పూర్వీకుల ఇంటిని కొందరు టీడీపీ నాయకులు నేలమట్టం చేసి, కబ్జా చేసేందుకు చదును చేసుకున్నారని, వారి బారి నుంచి తమ పూర్వీకుల ఆస్తిని కాపాడాలంటూ రామచంద్రయ్యకు చెందిన ఇద్దరు మనవళ్లు సోమవారం తహసీల్దార్ ప్రతాపరెడ్డి, ఎంపీడీఓ వీర్రాజు, సీఐ శ్రీనివాసులుకు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. రాయలచెరువులోని జమ్మాను కట్ట వద్ద ఉన్న ఆలయ సమీపంలో నివసించేవారమన్నారు. వందేళ్లుగా తమ పూర్వీకులు అక్కడే నివాసముండేవారని వివరించారు. 30 సంవత్సరాల క్రితం బ్రాహ్మణ వంశీయులు అందరూ క్రిష్టిపాడు, అనంతపురం తదితర ప్రాంతాలకు వలస వెళ్లి వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఈ క్రమంలో తాము కూడా క్రిష్టిపాడులో స్థిరపడినట్లు తెలిపారు. ఈ క్రమంలో పాడుపడిన రామచంద్రయ్య ఇంటిని వారం రోజుల క్రితం కొందరు టీడీపీ నాయకులు జేసీబీలను ఉపయోగించి పూర్తిగా తొలగించారని, అనంతరం టిప్పర్లతో మట్టిని తరలించి ఆ ప్రాంతాన్ని చదును చేసి ఆక్రమించుకున్నారని వాపోయారు. ఆక్రమణదారుల బారి నుంచి తమ పూర్వీకుల ఆస్తిని కాపాడాలంటూ అధికారులకు విన్నవించినట్లు తెలిపారు. ఈ విషయంపై తహసీల్దార్ ప్రతాపరెడ్డిని వివరణ కోరగా.. త్వరలో రామాలయం ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో ఆలయం పక్కన పాడుపడిన సత్రం ప్రాంతాన్ని చదును చేశారని తెలిపారు. ఆలయం పక్కన ఉన్న ఆ స్థలాన్ని ఎవరూ ఆక్రమించరాదని నోటీసులు పంపినట్లు వివరించారు.


