డిమాండ్లు నెరవేర్చకపోతే పోరుబాటే
● తేల్చి చెప్పిన జేఏసీ నేతలు
● మంగళవారం నాటి చర్చల్లో సానుకూల స్పందనంటూ వెల్లడి
అనంతపురం అగ్రికల్చర్: జీఓ 36 అమలుతో పాటు తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చకపోతే పోరు బాట తప్పదని ప్రభుత్వాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగుల యూనియన్ నాయకులు, జేఏసీ నేతలు హెచ్చరించారు. ఈ నెల 16 నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మె మంగళవారానికి తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో సానుకూల స్పందన లభించడంతో బుధవారం నుంచి ఉద్యోగులు విధుల్లో పాల్గొంటారని జేఏసీ నేతలు తెలిపారు. కొన్ని డిమాండ్లు పూర్తిగాను, మరికొన్ని పాక్షికంగా, ఇంకొన్ని చర్చల ద్వారా పరిష్కరించనున్నట్లు ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. కాగా, మంగళవారం అనంతపురంలోని రామ్నగర్లో ఉన్న డీసీసీబీ బ్రాంచి కార్యాలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతపురంలో జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులు, అసోసియేట్ ప్రెసిడెంట్ పి.హనుమంతరెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాసులు, కోశాధికారి ఎం.హనుమంతరెడ్డి తదితరులు మాట్లాడారు.


