
క్రీడల అభివృద్ధికి కూటమి సర్కార్ సహకారం పూర్తిగా కొరవడ
అనంతపురం: క్రీడా కుసుమాలను వెలికితీయాలంటే క్షేత్ర స్థాయిలో యువతను ప్రోత్సహించాలి. మట్టిలో మాణిక్యాలకు సరైన శిక్షణ ఇచ్చి వారిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని మెరుగుపరచాలి. ఈ ఉద్దేశంతోనే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గిరిజన విద్యార్థుల కోసం స్పోర్ట్స్ స్కూళ్లను ఏర్పాటు చేసింది. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న క్రీడల్లో రాణించేలా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా కోచ్లనూ నియమించింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే గిరిజన విద్యార్థుల క్రీడావకాశాలపై కోలుకోలేని దెబ్బ తీసింది. స్పోర్ట్స్ స్కూళ్లలో అడ్మిషన్లు సైతం నిలిపి వేసి వర్ధమాన క్రీడాకారుల జీవితాలతో చెడుగుడు ఆడుకుంటోంది.
నాడు రాణింపు..
గిరిజన విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ క్రమంలో అల్లూరి జిల్లా అరకులో ఉన్న ఏపీటీడబ్ల్యూఆర్ స్పోర్ట్స్ స్కూల్కు అనుబంధంగా రాష్ట్రంలో ఆరు క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేశారు. దీంతో పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట (బాలురు), భద్రగిరి (బాలికలు), తూర్పుగోదావరి జిల్లా ముసురుమిల్లి (బాలురు), ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెం (పీజీటీ–బాలురు), నంద్యాల జిల్లా మహానంది (బాలికలు), అనంతపురం జిల్లా గొల్లలదొడ్డి (బాలురు)లో స్పోర్ట్స్ స్కూళ్లు అందుబాటులోకి వచ్చాయి. గొల్లలదొడ్డిలోని స్పోర్ట్స్ స్కూల్లో అథ్లెటిక్స్, బాక్సింగ్, ఫుట్బాల్, వెయిట్ లిఫ్టింగ్ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆయా పాఠశాలల్లో 720 మంది బాల, బాలికలు ఆటల పోటీల్లో ప్రతిభాపాటవాలు ప్రదర్శించే అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు సంయుక్తంగా నిర్వహించే ఈ స్పోర్ట్స్ స్కూళ్లు 2022లో ఏర్పాటయ్యాయి. ఒక్కో ఈవెంట్కు ఒకరు చొప్పున మొత్తం 23 మంది కోచ్లను నియమించారు. క్రీడా పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి అడ్మిషన్ కల్పించేవారు. దీంతో నాడు అనేక మంది గిరిజన విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న స్పోర్ట్స్ స్కూల్లో చేరి క్రీడా నైపుణ్యాన్ని మెరుగు పరుచుకుని అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లోనూ రాణించారు.
అడ్మిషన్లకు నిరాకరణ
గిరిజన విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభను కూటమి ప్రభుత్వం తొక్కి పెట్టింది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 14 నెలలు కావస్తున్నా.. స్పోర్ట్స్ స్కూళ్లలో ఒక్క గిరిజన విద్యార్థికి కూడా అడ్మిషన్ ఇచ్చిన పాపాన పోలేదు. కోచ్లు ఉన్నప్పటికీ విద్యార్థుల అడ్మిషన్లు లేకపోవడంతో మొత్తం ఆరు స్పోర్ట్స్ స్కూళ్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ప్రభుత్వ తీరుపై గిరిజన సంఘాల నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్పోర్ట్స్ స్కూళ్లలో అడ్మిషన్లు కల్పించడకపోవడం వల్ల గిరిజన విద్యార్థులు తమలోని క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం కోల్పోతున్నారని ఆందోళన చెందుతున్నారు. గిరిజన పిల్లలు క్రీడల్లో ఎదగకుండా ఈ ప్రభుత్వం ఎందుకు కక్ష కట్టిందో అర్థం కావడం లేదని వాపోతున్నారు. వెంటనే స్పోర్ట్స్ స్కూళ్లలో గిరిజన విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించి, వారిని ఉన్నత స్థాయిలో చూసుకునే అవకాశమివ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
క్రీడల్లో గిరిజన విద్యార్థులు
రాణించకుండా సర్కార్ అడ్డుపుల్ల
అగమ్యగోచరంగా మారిన
స్పోర్ట్స్ స్కూళ్ల పరిస్థితి

క్రీడల అభివృద్ధికి కూటమి సర్కార్ సహకారం పూర్తిగా కొరవడ