
కందిపప్పు లేనట్టే!
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. చౌక దుకాణాల ద్వారా అందించే సరుకుల్లోనూ కోత పెడుతోంది. నెలకు కార్డుకు రూ.67తో కిలో కందిపప్పు ఇవ్వాల్సి ఉండగా.. ఫిబ్రవరి నుంచి పంపిణీ చేయడం లేదు. జిల్లాకు ప్రస్తుత మే నెలకు సంబంధించిన కందిపప్పు అలాట్మెంట్ కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో ఈ నెల కూడా ఎగనామమే అనేది స్పష్టమవుతోంది. కార్డుదారులు బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో రూ.130తో కొనాల్సి వస్తోంది.
పాత పాటే..
కందిపప్పు కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ స్థాయిలో టెండర్ ప్రక్రియ నడుస్తోంది... అది పూర్తయితే అలాట్మెంట్ వస్తుందంటూ నాలుగు నెలలుగా అధికారులు చెబుతున్నారు. దీన్నిబట్టే పేదల సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో 1,645 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 6,60,330 రేషన్ కార్డులు ఉన్నాయి. మొత్తం కార్డులకు సంబంధించి నెలసరి జిల్లాకు కందిపప్పు అలాట్మెంట్ 625 టన్నులు. కార్డుకు ఒక కిలో కందిపప్పు రూ.67తో ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. అయితే నాలుగు నెలలుగా పంపిణీ చేయకపోవడంతో కార్డుదారులు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు.
పేదలపై అదనపు భారం..
ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా కందిపప్పు నాలుగు నెలలుగా పంపిణీ చేయకపోవడంతో జిల్లాలోని పేదలు రూ.16.64 కోట్ల అదనపు భారం భరించారు. ప్రభుత్వం రూ.67తో ఇచ్చే కిలో కందిపప్పు నలుగురు లేదా ఐదుగురు ఉన్న ఒక కుటుంబానికి నెలంతా సరిపోతుంది. కానీ మార్కెట్లో కిలో రూ.130 ఉంది. ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కిలోపై రూ.63 అదనంగా వెచ్చించి మార్కెట్లో కొంటున్నారు. తద్వారా జిల్లాలోని 6,60,330 కార్డుదారులు నెలకు రూ.4.16 కోట్లు.. నాలుగు నెలల్లో రూ.16.64 కోట్లు అదనపు భారం భరించాల్సిన పరిస్థితి వచ్చింది.
మే నెలకూ అలాట్మెంట్ ఇవ్వని ప్రభుత్వం
వరుసగా నాల్గో నెలా పంపిణీకి ఎగనామం
6.60 లక్షల మంది
కార్డుదారులకు మొండిచెయ్యి
పేదలపై రూ.16.64 కోట్ల
అదనపు భారం

కందిపప్పు లేనట్టే!