
‘ప్రతి ఎకరాకూ కృష్ణా జలాలు అందించాలి’
గుంతకల్లు రూరల్: హంద్రీ–నీవా కాలువలో నీటి ప్రవాహ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులకు పెంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రతి ఎకరాకు కృష్ణా జలాలు అందించాలని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.రాంభూపాల్ డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి.శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి మారుతీప్రసాద్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యుడు కసాపురం రమేష్తో కలసి సోమవారం ఆయన జి.కొట్టాల వద్ద చేపట్టిన హంద్రీ–నీవా కాలువ పనులను పరిశీలించి, మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు హంద్రీ–నీవా కాలువను 10వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యం ఉండేలా వెడల్పు చేయాలన్నారు. అప్పటి వరకూ కాలవకు లైనింగ్ పనులు చేయరాదన్నారు. రాగులపాడు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా వజ్రకరూరు, గుంతకల్లు, పామిడి మండలాల్లోని గ్రామాలకు తాగు, సాగునీటిని అందించాలన్నారు.