అనకాపల్లి టౌన్: అజ్ఞానమనే చీకట్లను తొలగించే జ్ఞాన జ్యోతులు గురువులని, వారి సేవలు వెలకట్టలేనివని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 60 మందికి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం స్థానిక ఎస్.ఆర్. శంకరన్ హాల్లో శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదన్నారు. వారి నిరంతర కృషి వల్లే సమాజంలో విద్యావంతులు తయారవుతున్నారని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 2.04 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని చెప్పారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు తల్లికి వందనం పథకం కింద జిల్లాలో తల్లుల ఖాతాలో రూ.301 కోట్లు జమ చేస్తున్నట్టు చెప్పారు. ఎస్ఎంసీ గ్రాంట్ ద్వారా రూ.5.19 కోట్లు విడుదల చేసి పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచామన్నారు. వంద రోజుల ప్రణాళిక ద్వారా పదవ తరగతి ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించడంలో ఉపాధ్యాయుల కృషి అభినందనీయమన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు ముఖ్యమని, ప్రతి రోజు గంట సమయాన్ని ఆటలు, వ్యాయామానికి కేటాయించాలన్నారు. దీని వల్ల వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి, రోగాలకు దూరంగా ఉంటారన్నారు. ఓటమికి ఎప్పుడూ కుంగిపోరాదని, ప్రణాళికతో కృషి చేస్తే విజయం సొంతమవుతుందని చెప్పారు. ఈ విషయం తన జీవితంలో నిజమైందన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు రాబట్టడంలో ఉపాధ్యాయుల కృషి వెలకట్టలేనిదన్నారు. ఫిన్లాండ్ దేశంలో విద్యా వ్యవస్థపై అధ్యయనం చేయడానికి జిల్లా నుంచి వెళ్లిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో ఉత్తమ సేవలందించిన 60 మంది ఉపాధ్యాయులను దుశ్శాలువాలు, సర్టిఫికెట్లతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు, సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ విజయకృష్ణన్


