పెరిగిన వార్డులతో మారనున్న జోన్ల రూపురేఖలు ముసాయిదా సరిహద్దులు విడుదల 11వ తేదీ లోగా అభ్యంతరాలు, సూచనలు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజనకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల కావడంతో నగర పాలనా పటంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం ఉన్న 98 వార్డులను 120కి పెంచుతూ ముసాయిదా, సరిహద్దులను ఖరారు చేశారు. దీంతో వార్డుల సంఖ్య పెరగడంతో పాటు జోన్ల రూపురేఖలు కూడా మారనున్నాయి.
అభ్యంతరాలుంటే తెలపొచ్చు
ప్రతిపాదిత 120 వార్డుల ముసాయిదా సరిహద్దులను శనివారం నుంచి ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు పునర్వ్యవస్థీకరించిన 10 జోనల్ కార్యాలయాలు, నగర పరిధిలోని ముఖ్య ప్రభుత్వ కార్యాలయాల నోటీస్ బోర్డుల్లో వీటిని ప్రదర్శించనున్నారు. జీవీఎంసీ అధికారిక వెబ్సైట్లోనూ ముసాయిదా సరిహద్దుల వివరాలను అందుబాటులో ఉంచారు. ప్రతిపాదిత వార్డుల పున ర్విభజన, సరిహద్దులపై ప్రజలకు ఏవైనా సూచనలు, అభ్యంతరాలు ఉంటే ఈ నెల 11వ తేదీలోగా అందజేయాలని కమిషనర్ కేతన్గార్గ్ కోరారు. అందిన అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన అనంతరం తదుపరి ప్రక్రియ చేపడతామని తెలిపారు.
గాజువాకలో అత్యధికంగా..
జోన్ల వారీగా చూస్తే అత్యధికంగా గాజువాక జోన్లో నాలుగు వార్డులు పెరిగాయి. తూర్పు, దక్షిణ, ఉత్తర, పశ్చిమ జోన్లలో మూడేసి వార్డులు, మధురవాడలో రెండు వార్డులు అదనంగా చేరాయి. భీమునిపట్నం, అగనంపూడి, అనకాపల్లి, పెందుర్తి జోన్ల్లో ఒక్కో వార్డు చొప్పున పెరిగింది.


