అనకాపల్లి: గణేష్ ఉత్సవాలకు నిర్వాహకులు ముందస్తుగా సింగిల్ విండో ఆన్లైన్ పర్మిషన్ సిస్టమ్ ద్వారా అనుమతి పొందాలని ఎస్పీ తుహిన్ సిన్హా శనివారం తెలిపారు. మండపాల నిర్వాహకులు వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బంది లేకుండా ఏపీ పోలీసు శాఖ ప్రత్యేకంగా సింగిల్ విండో ఈ పోర్టల్ ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. మండపాల ఏర్పాటు, లౌడ్ స్పీకర్లు, ఊరేగింపు, నిమజ్జనానికి సంబంధించిన అన్ని అనుమతులు సింగిల్ విండోద్వారా పొందవచ్చని తెలిపారు. ఇందుకు నిర్వాహకులు ఎటువంటి చలానాలు కట్టనవసరం లేదని పేర్కొన్నారు.
ఆన్లైన్ అనుమతి పొందే విధానం...
నిర్వాహకులు కమిటీగా ఏర్పడి https:// ganeshutsav.net వెబ్సైట్లో పూర్తి వివరాల ను నమోదు చేయాలని తెలిపారు. మొబైల్ నంబరును నమోదు చేసి, వచ్చే ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలని తెలిపారు. దరఖాస్తుదారుని పేరు, చిరునామా, కమిటీ/అసోసియేషన్ పేరు, ఇ–మెయిల్ ఐడీ, మండపం ఏర్పాటు చేసే స్థలం, సంబంధిత సబ్ డివిజన్, పోలీసు స్టేషన్ పరిధి, గణేష్ విగ్రహం ఎత్తు, మండపం కొలతలు, కమిటీ సభ్యుల వివరాలు, వారిఫోన్ నంబర్లు, నిమజ్జనం తేదీ, సమయం, రూట్ మ్యాప్, ఉపయోగించే వాహనాల వివరాలు నమోదు చేయాలని తెలిపారు.
క్షేత్రస్థాయి పరిశీలన...
దరఖాస్తు సమర్పించిన అనంతరం స్థానిక పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారని తెలిపారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, ప్రమాదాలు,ఘర్షణలకు తావులేకుండా పండగను భక్తి శ్రద్ధలతో, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని ఆయన కోరారు.
ఎస్పీ తుహిన్ సిన్హా


