ఓట్ల కోసం చంద్రబాబు ఎంతకై నా దిగజారుతారని ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీలే చెబుతుంటాయి. అమలు కానీ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక తూట్లు పొడవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అలా కె.కోటపాడు వేదికగా గత సార్వత్రిక ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు రెండున్నరేళ్ల తర్వాత కూడా అమలు కాకపోవడంపై స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎ.కోడూరులో శనివారం జరిగే ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికి సీఎం రానున్న నేపథ్యంలో హామీలపై స్పష్టత కోరుతూ, పేరుకుపోయిన సమస్యల పరిష్కారం కోసం కోటపాడు మండల ప్రజలు ఎదురుచూస్తున్నారు. – సాక్షి, అనకాపల్లి
కొండెక్కిన
● నీటి మూటలుగా చంద్రబాబు ఎన్నికల హామీలు
● గోవాడ సుగర్స్ ఆధునికీకరణ, బీఎన్ రోడ్డు అభివృద్ధి ఉత్త మాటే
● కూటమి ప్రభుత్వంలో
పూర్తిగా మూతపడిన ఫ్యాక్టరీ
● ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా కె.కోటపాడుకు సాగునీరు కలే
● కోటపాడు వేదికగా ఇచ్చిన ఆడబిడ్డ నిధి హామీ ఊసే లేదు
ఆడబిడ్డ నిధి ఏదీ?
’సూపర్ సిక్స్’హామీల్లో భాగంగా 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకూ నెలకు రూ. 1,500 ఇస్తామని కోటపాడు సభ నుంచి అట్టహాసంగా ప్రకటించిన ‘ఆడబిడ్డ నిధి’ఈ రెండున్నరేళ్లలో ఒక్క పైసా కూడా ఆడపడుచుల ఖాతాల్లో పడలేదు. నిత్యావసరాల ధరలు మండిపోతున్న తరుణంలో ఈ పథకం అందుతుందని ఆశపడ్డ మహిళలకు ఏమాత్రం ఊరట లభించలేదు. ఇప్పటికీ ఆ పథకానికి అతీగతీ లేదు.
స్థానిక సమస్యలు స్వాగతం
●కె.కోటపాడు మండలంలోని చౌడువాడతో పాటు శివారు గ్రామాలైన పాచిలవానిపాలెం, మల్లంపాలెం గ్రామాలకు చెందిన రైతులు సుమారు మూడు తరాలకు పైబడి సాగు చేసుకుంటున్న భూములకు ఎటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు లేక భరోసాను పొందలేకపోతున్నారు. ఈ మూడు గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు తమ సాగులో ఉన్న 354 ఎకరాల భూములకు తమ పేరున హక్కులు కల్పించాలని కోరుతున్నారు. సాగు హక్కుల కోసం వీరంతా పీజీఆర్ఎస్లలోనూ, జేసీ, ఆర్డీవో, తహసీల్దార్లను కలిసి వినతిపత్రాలు అందిస్తున్నా సమస్య పరిష్కారం మాత్రం అందని ద్రాక్షగానే మిగులుతోంది.
●కె.కోటపాడు మండలం లంకవానిపాలెం గ్రామంలో దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న గ్రామకంఠం భూముల సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ప్రజలు నివాసముంటున్న ఈ భూముల్లో శాశ్వత నివాసాలు కట్టుకోవాలంటే ప్రాథమిక హక్కుల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రజలు నివాసముంటున్న స్థలాలను గ్రామకంఠం స్థలాలుగా గుర్తించి, రెవెన్యూ రికార్డుల నుంచి ఎండోమెంట్ పేరును తొలగించాలని ఎన్నో ఏళ్లుగా అధికారులను కోరుతున్నారు.
●కె.కోటపాడు మండలంలో ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. గత ఎన్నికల సమయంలో వెనుకబడిన మాడుగుల నియోజకవర్గంలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ఈ ప్రాంత విద్యార్థులు ఇంజినీరింగ్ చదువుల కోసం లక్షలాది రూపాయలు చెల్లించలేని పరిస్థితి ఉంది. అందుబాటులో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
అదనపు తరగతి గదుల మంజూరుకు ఎదురుచూపు
ఎ.కోడూరు హైస్కూల్లో ప్రస్తుతం 546 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలలో ప్రస్తుతం 14 తరగతి గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా మరో ఆరు అదనపు తరగతి గదులు నిర్మిస్తే భవన సమస్య ఉండదని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


