పరవాడ: జేఎన్ ఫార్మాసిటీలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు ఉద్యోగుల్లో భద్రతపై అవగాహన పెంచేందుకు ప్రతి నెలా మూడో శుక్రవారం జేఎన్పీసీ భవనంలో భద్రతా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంఏఎస్ఆర్ఎం కార్యదర్శి జెట్టి సుబ్బారావు తెలిపారు. ఎంఏఎస్ఆర్ఎం ఆధ్వర్యంలో పరిశ్రమల భద్రతపై యాజమాన్యాలు, ఉద్యోగులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ.. ఏడాది కాలంగా పరిశ్రమల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉద్యోగుల్లో భద్రతపై చైతన్యం కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది డిసెంబరు వరకు నిరంతరం కొనసాగించేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఈహెచ్ఎస్ విభాగాల సిబ్బందికి ఈ అవగాహన సదస్సులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ‘జీరో హార్మ్–జీరో హజార్డ్’లక్ష్యంతో అన్ని పరిశ్రమల్లో ప్రమాదాలను నివారించి, సురక్షితమైన పని వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఫార్మాసిటీ పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులు తమ పరిశ్రమల్లో అమలు చేస్తున్న భద్రతా విధానాలు, ప్రమాదాల నివారణ చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇతర పరిశ్రమల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పలు పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


