మాడుగుల జోన్ : కె.కోటపాడు మండలం ఎ.కోడూరు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఎ.కోడూరుకు చేరుకోనున్న సీఎం.. అనంతరం ఎస్సీ కాలనీలో నిర్వహించే స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. అక్కడి నుంచి ఉదయం 11 గంటలకు ప్రజావేదిక సభా ప్రాంగణానికి చేరుకుని, మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సీఎం తిరిగి బయలుదేరనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ విజయకృష్ణన్ పర్యవేక్షిస్తున్నారు. సభా వేదికను సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా భద్రత, ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు.


