సాక్షి, విశాఖపట్నం: బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ శుక్రవారం అధికారులతో కలిసి భీమిలి బీచ్ రోడ్డు, మంగమారిపేట, తొట్లకొండ, రుషికొండ బీచ్ ప్రాంతాలను పరిశీలించారు. ప్రతినిధులు సందర్శించే ప్రాంతాల్లో భద్రత, పారిశుద్ధ్యం, రహదారులు, వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లను పర్యవేక్షించారు. అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పర్యాటక ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి, సుందరీకరణ పనులను కూడా పరిశీలించారు. ప్రతినిధుల పర్యటన సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
తొట్లకొండలో ఆంక్షలు
బ్రిక్స్ ప్రతినిధుల పర్యటన నేపథ్యంలో తొట్లకొండకు సందర్శకుల ప్రవేశంపై రెండు రోజులపాటు ఆంక్షలు విధించారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పర్యాటకులు, సందర్శకులను తొట్లకొండపైకి అనుమతించబోమని వీఎంఆర్డీఏ కార్యదర్శి మురళీకృష్ణ తెలిపారు. ఈ సమయంలో ప్రతినిధుల పర్యటనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.


