మహారాణిపేట: స్టైపెండ్ పెంపు సహా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూనియర్ వైద్యులు (జూడాలు) మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా కేజీహెచ్లో ఓపీ సేవలు గణనీయంగా ప్రభావితమయ్యాయి. పీజీ వైద్యులు, హౌస్ సర్జన్లు విధులకు దూరంగా ఉండటంతో వైద్యుల కోసం రోగులు గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. పలు విభాగాల్లో శస్త్రచికిత్సలు సైతం వాయిదా పడ్డాయి. కేజీహెచ్తోపాటు ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ప్రభుత్వ మానసిక ఆస్పత్రి, రాణి చంద్రమ్మణి దేవి ఆస్పత్రి, ఈఎన్టీ, టీబీ ఆస్పత్రుల్లోనూ జూడోల సమ్మె ప్రభావం కనిపించింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ సేవలను బహిష్కరిస్తున్నామని, అత్యవసర వైద్య సేవలకు మాత్రమే హాజరవుతామని జూనియర్ వైద్యుల సంఘం నాయకుడు డాక్టర్ శిరాజ్ తెలిపారు.


