
యాచకులు లేని నగరంగా విశాఖ
అల్లిపురం (విశాఖ): యాచకులు లేని నగరంగా విశాఖను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పది నెలల కిందట నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తలపెట్టిన ‘జ్యోతిర్గమయ’ కార్యక్రమానికి ఒక రూపు వచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా నగరంలోని యాచకులకు తగిన ఆశ్రయం కల్పించి, వారిని గౌరవప్రదమైన జీవితం వైపు నడిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీపీ తెలిపారు. గురువారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడారు. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అంటే చీకటి నుంచి వెలుగు వైపు ప్రయాణమని వివరించారు. రోడ్లపై భిక్షాటన చేసే నిరాశ్రయులను రోజూ చూసి బాధపడేవాడినని, ప్రతి మనిషి గౌరవంగా జీవించడానికి ప్రయత్నించాలన్నారు. కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ హుస్సేన్, హార్బర్ సీఐ సింహాద్రి నాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ తిరుపతిరావు, సీఐ చప్పా ప్రసాద్(వీఆర్), నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు చెప్పారు. గురువారం ఒక్క రోజే 243 మంది యాచకులను గుర్తించి, వారికి క్షవరం, స్నానం చేయించి, కొత్త దుస్తులు ఇచ్చి, టిఫిన్తో పాటు భోజనం కూడా అందించినట్లు తెలిపారు. 243 మందిలో 45 మంది బాగా ఉండటంతో వారి కుటుంబ సభ్యులను పిలిపించి, వారికి అప్పగించినట్లు వివరించారు. మానసిక స్థితి సరిగా లేని 9 మందిని ప్రభుత్వ మానసిక ఆరోగ్య ఆసుపత్రిలో చేర్పించామన్నారు. మిగిలిన 189 మందిని వివిధ పునరావాస కేంద్రాలకు పంపించినట్లు తెలిపారు.