
రెండు తులాల బంగారం కోసం చిన్నాన్నని చంపేశాడు..
● నాటు తుపాకీతో హత్య చేసిన వ్యక్తి అరెస్టు
నిందితుడు అప్పారావుని విలేకరుల ముందు హాజరుపరచి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ, సీఐ
కొత్తవలస : కేవలం రెండు తులాల బంగారం కోసం జరిగిన వివాదం వరసకు చిన్నాన్న అయిన సిమ్మ అప్పారావును నాటు తుపాకీతో కాల్చి చంపడానికి దారి తీసిందని విజయనగరం డీఎస్సీ శ్రీనివాసరావు తెలిపారు. కొత్తవలస మండలం ముసిరాం గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావు(70)ను తన మేనకోడలు భర్త అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం పాతవలస గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావు ఈ నెల 5వ తేదీన అతి సమీపం నుంచి నాటు తుపాకీతో కాల్చి చంపాడు. సీఐ సిహెచ్.షణ్ముఖరావు కేసు నమోదుచేశారు. నిందితుడు కోటపాడు రోడ్డు సీతంపేట గ్రామ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా బుధవారం పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు కేసు వివరాలను డీఎస్పీ స్థానిక విలేకరులకు వెల్లడించారు. నిందితుడు అప్పారావు భార్య ఏడాదిన్నర కిందట మృతి చెందింది. ఆమెకు సంబంధించిన బంగారం, భూమి ఇతర ఆస్తులు మేనమామ అయిన మృతుడు సిమ్మ అప్పారావు వద్ద ఉన్నట్టు తెలిపారు. సదరు బంగారం, భూమి ఇవ్వాలని నిందితుడు అప్పారావు మృతుడు అప్పారావుని పలుమార్లు అడిగాడు. అయినా బంగారం ఇవ్వకపోవడంతో ఈ నెల 5న నిందితుడు తన సొంత ఆటోలో ముసిరాం వచ్చి మరోసారి బంగారం ఇవ్వమని అడిగాడు.
ఆయన నిరాకరించడంతో తనతో పాటు తెచ్చుకున్న నాటు తుపాకీతో గుండైపె కాల్చడంతో అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడని తెలిపారు. పాతవలస సమీపంలో ఉంచిన తుపాకీని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని అరెస్టు చేసి కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు తెలిపారు.