తుమ్మపాల: సాంకేతిక విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ విద్యా సంస్థలను ఏర్పాటు చేసిందని, తద్వారా విద్యార్థులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని అచ్యుతాపురంలో గల ఎంఎస్ఎంఈ విద్యా సంస్థ అధ్యాపకులు డాక్టర్ కె.వెంకట అప్పారావు అన్నారు. పట్టణంలో గల మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో శుక్రవారం 10వ తరగతి విద్యార్థులతో ఆయన మాట్లాడారు. అచ్యుతాపురంలో ఉన్న పారిశ్రామిక వాడలో అన్ని సౌకర్యాలతో ఎంఎస్ఎంఈ విద్యా సంస్థ ఏర్పాటు చేశారన్నారు. టెన్త్ పూర్తి చేసిన విద్యార్థులు ఇక్కడ డిప్లమో కోర్సులో ప్రవేశ పొందడం ద్వారా ప్రఖ్యాత పరిశ్రమల్లో ఉపాధి పొందవచ్చని తెలిపారు. అదే విధంగా బీటెక్లో కూడా ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఫీజు రియింబర్స్మెంట్, స్కాలర్షిప్ కూడా విద్యార్థుల పొందవచ్చన్నారు. ప్రవేశ పరీక్షకు ప్రస్తుతం ఆన్లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉందని, ఏప్రిల్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎంట్రన్స్ పరీక్ష మే 4న ఉంటుందన్నారు. ప్రిన్సిపాల్ దేవరశెట్టి వెంకటేశ్వర్లు, హిందీ అధ్యాపకులు మహేంద్రనాథ్ పట్నాయక్, ఆంగ్ల అధ్యాపకురాలు సుహాసిని, పాఠశాల యాజమాన్య కమిటీ వైస్ చైర్మన్ కర్రి గంగాధర్, 10వ తరగతి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.