ఏలేశ్వరం : పామాయిల్ తోటలోకి వెళ్లేందుకు యత్నించిన ఎలుగు బంటి ఇనుప కంచెలో ఇరుక్కుపోయింది. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పరిమితడక గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. యర్రవరం గ్రామానికి చెందిన తోట వీరగోపాలకృష్ణ అనే రైతు పరిమితడకలో పామాయిల్ సాగు చేస్తున్నాడు. సమీపంలో ఉన్న కొండ నుంచి వచ్చిన ఎలుగుబంటి తోటలోకి వెళ్లేందుకు యత్నించి తోట చుట్టూ ఏర్పాటుచేసిన ఇనుప కంచెలో ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖాధికారులు దానికి మత్తు మందు ఇచ్చి బంధించారు. అనంతరం దానిని విశాఖపట్నంలోని జూకు తరలించారు.


