సీలేరు: గూడెం కొత్తవీధి మండలం ఎ.దారకొండ పంచాయతీ నడివిడి గ్రామం మధ్య ఉన్న వాగుపై తక్షణమే వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆ పంచాయతీ ప్రజలు సోమవారం వాగులోకి దిగి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి, ఎంపీటీసీ బుజ్జిబాబు మాట్లాడుతూ వంతెన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయి చాలాకాలమైనా ఇంత వరకు పనులు చేపట్టలేదన్నారు. వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రోజుల తరబడి రాకపోకలు నిలిచిపోయి పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వంతెన లేకపోవడంతో నిత్యావసర సరకులు కూడా తీసుకురాలేని దుస్థితి నెలకొందని తెలిపారు. అత్యవసరమై వాగు దాటేందుకు ప్రయత్నిస్తున్న వారు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని చెప్పారు. వెంటనే వంతెన నిర్మాణపనులు ప్రారంభించాలని, లేకపోతే ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రజలతో కలిసి ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.


