పొగ మంచుతో కనువిందు చేస్తున్న డుడుమ జలపాతం ప్రాంతం
ముంచంగిపుట్టు: ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో ఉన్న డుడుమ జలపాతం సోయగాలు అదరహో అనిపిస్తున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పొగమంచు కొండలను తాకుతూ వెళుతున్న దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. డుడుమ అందాలను తిలకించేందుకు ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాలతో పాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఫొటోలు, సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.
కొత్తపల్లి జలపాతం వద్ద..
జి.మాడుగుల: వాతావరణంలో మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో సోమవారం పొగమంచు దట్టంగా కురిసింది. మండు వేసవిలో శీతాకాలాన్ని తలపించేలా పొగమంచు అలుముకుంది. జి.మాడుగుల, పాడేరు, చింతపల్లిలలో కురిసింది. కొత్తపల్లి జలపాతం వద్ద పొగమంచు అలుముకోవడంతో పర్యాటకులు ఎంజాయ్ చేశారు.


