పాడేరు: ఆదివాసీలకు శతశాతం ఉద్యోగ రిజర్వేషన్పై టీఏసీ తీర్మానం చేసి, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని, స్పెషల్ డీఎస్సీపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధాకృష్ణతో పాటు పలువురు డిమాండ్ చేశారు. ఎన్ని కుట్రలు జరిగినా ఇందుకోసం పోరాడతామని స్పష్టం చేశారు. పట్టణంలోని ఏపీటీఎఫ్ భవనంలో సోమవారం ఆదివాసీ ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన చట్టాలు, హక్కులను అమలు చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందన్నారు. జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయంగా జీవో తెస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చి రెండున్నరేళ్లవుతున్నా ఆ దిశగా చర్యలు చేపట్టలేదని చెప్పారు. హామీలు అమలు చేయకుండా చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో ఆదివాసీల కోసం ఖాళీగా ఉన్న రెండు వేల ఉపాధ్యాయ పోస్టులకు స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల చట్టాలు, హక్కుల అమలు, పరిరక్షణతో పాటు శతశాతం ఉద్యోగ రిజర్వేషన్ల కోసం ఆదివాసీ సమాజం శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలను అణిచివేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఎన్ని కుట్రలు, అణిచివేసే ప్రయత్నాలు చేసినా పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంతాల నాగేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కార్తీక్ శ్రీను, జీవన్ కృష్ణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణ, ఇసాక్, నిరుద్యోగుల సంఘం నాయకులు భాను, సీహెచ్ రావు, కొండలరావు, ఆదివాసీ సంఘాల నాయకులు సోమెల బాలరాజు, బి. లచ్చన్న, కిల్లో రాజారావు, చంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.


