నాతవరం: తాండవ రిజర్వాయరు ఏలేరు కాలువ అనుసంధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతో పోలవరం కాలువ నుంచి తాండవకు ఎత్తిపోతల పథకం తెస్తానంటూ అయ్యన్న పాత్రుడు హామీచ్చారు. దానికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవడంతో అయ్యన్న హామీ రైతులను మభ్యపెట్టే విధంగా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్రెడ్డి తాండవ కాలువలు రూ. 65కోట్లతో సిమెంట్ లైనింగ్ పనలు చేసి రైతులకు దన్నుగా నిలిచారు. ఆయన తనయుడు వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను తలపించేలా చేసేందుకు ఏలేరు కాలువ తాండవ ప్రాజెక్టు అనుసంధానం చేసేందుకు రూ. 470 కోట్లు 5లక్షలు మంజూరు చేసి ఆయనే స్వయంగా 2022లో డిసెంబరులో నర్సీపట్నంలో అనుసంధానం పనులకు శంకుస్థాపన చేశారు. అనుసంధానానికి నిధులు మంజూరు చేయడంతో రూ.10 కోట్ల మేర పనులకు ఖర్చు చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం ప్రాజక్టు నుంచి అదనపు నీటిని ఏలేరు కాలువ ద్వారా తరలించేందుకు అదనపు భూమి సేకరించారు. మండలంలో అనుసంధానం పనులకు సంబంధించి ఏలేరు తాండవ కాలువలను రాష్ట్ర ఇరిగేషన్శాఖ ఈఎన్సీ నార్త్కోస్ట్ సీఈతో పాటు ఇతర ఇంజినీరింగ్ అధికారులు స్వయంగా పరిశీలన చేశారు. అనుసంధానం పనులకు టీడీపీకి చెందిన మాజీ ఎంపీ కె.ఎం.కె కంపెనీ సంస్థ కాంట్రాక్టరు దక్కించుకున్నారు. ఈ పనులు సకాలంలో పూర్తి చేస్తే రెండు జిల్లాల్లో వైఎస్సార్సీపీకి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో పనుల్లో జాప్యం చేయడంతో సార్వత్రిక ఎన్నికలు వచ్చేసాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తాండవ ఏలేరు అసునంధానం పనులు 25 శాతం కూడా పూర్తి చేయలేదంటూ రద్దు చేసింది. ఈ పనులు రద్దు పై రెండు జిల్లాల్లో రైతుల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అన్న భయంతో స్పీకరు అయ్యన్నపాత్రుడు పోలవరం కాలువ నుంచి తాండవకు నీరు తెస్తానంటూ 2024 అక్టోబరులో మండల పర్యటనకు వచ్చినపుడు సభలో హామీ ఇచ్చారు. ఎత్తిపోతల పథకం నా జీవిత ఆశయమని..గొప్పగా చేప్పేశారు. పోలవరం కాలువ నీటిని తుని మండలం రేఖవానిపాలెం గ్రామం నుంచి తాండవకు తీసుకురావాలని దీనికి రూ.2400 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. నేటికీ పోలవరం తాండవ ఎత్తిపోతల పధకం ప్రతిపాదనలే ఇరిగేషన్ శాఖలో లేకపోవడం గమనార్హం.
క్యాబినెట్లో ప్రస్తావన ఏదీ...
రాష్ట్ర క్యాబినెట్లో రాష్ట్రంలో పలు ప్రాజెక్టులపై చర్చించి కొన్ని ప్రాంతాలకు కొత్తవి మంజూరు చేశారు. పోలవరం తాండవ ఎత్తిపోతల పథకంపై కనీసం చర్చకు రాకపోవడం విశేషం. ఖరీఫ్ సాగుకు మంగళవారం తాండవ రిజర్వాయరు నుంచి ఆయకట్టుకు గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు. ఏలేరు తాండవ అనుసంధానం పనులు రద్దు చేయకుండా కొనసాగిేస్తే పనులు పూర్తి అయ్యేవని రెండు జిల్లాల పరిధిలో వేలాది ఎకరాలు సస్యశ్యామలం అయ్యేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అరకొరగా పూడిక తీత పనులు
ఆయకట్టుకు నీరు ప్రవహించే కాలువలో పూర్తి స్థాయిలో పూడిక తీత పనులు చేయలేదు. గత నెలలో మన్యపురట్ల తాండవ నీటి సంఘం అధ్యక్షుడు అప్పన దివాణం నిమ్మకట్టు ఆనకట్ట ప్రధాన కాలువలో ఉన్న పూడికను స్వయంగా అధికారులను తీసుకెళ్లి చూపించారు. పూడిక తీశాకే నీరు విడుదల చేస్తే నీరు ప్రవహిస్తుందని తెలిపారు. అయితే ఆ కాలువలో పూడిక నేటికీ తీయలేదు. తాండవ ప్రధానగేట్లకు రూ.లక్షలు వ్యయంతో మరమ్మతులు చేసినా లీకేజీ అరికట్టలేదు.
2024లో పోలవరం–తాండవ ఎత్తిపోతల పథకం తెస్తానంటూ సభలో హామీ ఇస్తున్న స్పీకర్ అయ్యన్న (ఫైల్)
హామీ నెరవేర్చాలి..
స్పీకరు అయ్యన్నపాత్రుడు పోలవరం తాండవ ఎత్తిపోతల పథకం కోసం బహిరంగ సభలో ఇచ్చిన హామీని నెరవేర్చాలి. మా ప్రభుత్వం హయంలో మంజూరు చేసిన ఏలేరు తాండవ అనుసంధానం పనులు రాజకీయ కక్షతో రద్దు చేశారు. అనుసంధానం పనులు సకాలంలో పూర్తి అయి ఉంటే రెండు జిల్లాల్లో వేలాది ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు ప్రవహించేది. రైతులు పడే సాగునీటి కష్టాలు తీరేవి. కూటమి ప్రభుత్వం చేస్తున్న గిమ్మిక్కులు ప్రజలు గమిస్తున్నారు.
–పెట్ల ఉమా శంకర్ గణేష్, మాజీ ఎమ్మెల్యే
ప్రతిపాదన లేదు
పోలవరం తాండవ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదనలు లేదు. దీనిపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రస్తుతం తాండవ ప్రాజెక్టు పరిధిలో కాలువలో పూడికతీత మరమ్మతు పనులు చేస్తున్నాం. గతంతో పోలిస్తే ఈఏడాది బాగా చేశాం.
–ఆనురాధ, డీఈ తాండవ ప్రాజెక్టు


