రెండో రోజూ కొనసాగిన
జూనియర్ వైద్యుల సమ్మె
శస్త్రచికిత్సలు వాయిదా.. వార్డుల్లోనూ వైద్య సేవలకు ఆటంకం
ఓపీ టికెట్లు తీసుకుని గంటల తరబడి వేచి ఉన్న రోగులు
మహారాణిపేట: జూనియర్ వైద్యుల సమ్మెతో కేజీహెచ్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. సమ్మెలో భాగంగా బుధవారం రెండో రోజు కూడా జూనియర్ వైద్యులు ఓపీలను బహిష్కరించి, నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దీంతో కేజీహెచ్లోని 26 ఓపీల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. దూర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చిన రోగులు గంటల తరబడి ఓపీల వద్ద వేచి ఉండాల్సి వచ్చింది. పీజీ వైద్యులు, జూనియర్ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పలు శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి. వార్డుల్లో రోగులకు వైద్య సేవలు అందించడంలోనూ ఇబ్బందులు తలెత్తాయి. బుధ వారం కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద ప్రారంభమైన జూనియర్ వైద్యుల నిరసన ప్రదర్శన ఆంధ్ర మెడికల్ కాలేజీ, క్యాజువాలిటీ మీదుగా తిరిగి సూపరింటెండెంట్ కార్యాలయం వరకు సాగింది. అనంతరం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మహిళా జూనియర్ వైద్యులు కూడా దీక్షకు సంఘీభావం తెలిపారు. విశాఖలోని కేజీహెచ్, ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ప్రభుత్వ మానసిక ఆస్పత్రి, రాణి చంద్రమణి దేవి ఆస్పత్రి, ఈఎన్టీ ఆస్పత్రి, టీబీ ఆస్పత్రుల్లోనూ సమ్మె ప్రభావం కనిపించింది. ఓపీ సేవలతోపాటు శస్త్రచికిత్సలకు కూడా అంతరాయం ఏర్పడింది. కేజీహెచ్లో రోజూ సుమారు వెయ్యి మంది పీజీ వైద్యులు, 500 మంది జూనియర్ వైద్యులు ఓపీ సేవలు అందిస్తుంటారు. వీరు సమ్మెలో ఉండటంతో బుధవారం రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆంధ్ర మెడికల్ కాలేజీ అధ్యక్షుడు దినకర్ సాయి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కె.రవీందర్, విశాఖ యూనియన్ నాయకుడు డాక్టర్ శిరాజ్ తదితరులు నిరసనలో పాల్గొన్నారు.


