● గింజర్తిలో 3, 4, 5 తరగతులనిర్వహణకు కలెక్టర్ ఆదేశాలు
● కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు
కొయ్యూరు: రెండేళ్లుగా తమను వెంటాడుతున్న సమస్య పరిష్కారం కోసం గింజర్తి పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు చేసిన పోరాటం ఫలించింది. పాఠశాలలో 3, 4, 5 తరగతుల నిర్వహణను తిరిగి కొనసాగించేందుకు కలెక్టర్ నిశాంతి ఆదేశాలు జారీ చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం పాఠశాలలో సమావేశమైన వారు కలెక్టర్ నిశాంతి, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మకు కృతజ్ఞతలు తెలిపారు. తరగతుల నిర్వహణ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఇటీవల గ్రామస్తులు, విద్యార్థులు స్థానిక మండల విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట ఐదు రోజులపాటు రిలే దీక్షలు చేపట్టారు. సమస్యను పరిష్కరిస్తామని తొలుత ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ హామీ ఇచ్చినా వారు దీక్షలు కొనసాగించారు. అనంతరం కలెక్టర్ నిశాంతి హామీ ఇవ్వడంతో దీక్షలను విరమించారు.తాజాగా కలెక్టర్ ఆదేశాలతో పాఠశాలలో 3, 4, 5 తరగతుల నిర్వహణకు మార్గం సుగమమైంది. రెండేళ్లుగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యను కలెక్టర్ పరిష్కరించారని విద్యా కమిటీ చైర్మన్ అప్పారావు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్పందించిన కలెక్టర్కు ఎప్పటికీ రుణపడి ఉంటామని, ఆమె చేసిన మేలును మరువలేమని అన్నారు.


