విద్యుత్ వినియోగదారుల ఆందోళన
నర్సీపట్నం: విద్యుత్ మీటర్ల రీడింగ్ నమోదుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జియో ఫెన్సింగ్ విధానం వినియోగదారులకు గుదిబండగా మారింది. సకాలంలో మీటర్ల రీడింగ్ నమోదు ప్రక్రియ పూర్తికాకపోవడంతో స్లాబ్ రేట్ పెరిగి వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడుతుంది. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈపీడీసీఎల్ అధికారులు సరైన సాంకేతిక అవగాహన, పర్యవేక్షణ లేకుండా రీడింగ్ నమోదు చేసే మిషన్లలో జియో ఫెన్సింగ్(జీపీఆర్ఎస్) సాఫ్ట్వేర్ను అప్లోడ్ చేశారు. రీడింగ్ సిబ్బంది స్వయంగా విద్యుత్ మీటర్ వద్దకు వెళ్తేనే తప్ప రీడింగ్ రాదు. మీటర్ల రీడింగ్ నమోదులో ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా జియోఫెన్సింగ్ సాఫ్ట్వేర్ను తీసుకొచ్చారు. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాలకు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడంతో సాఫ్ట్వేర్ సక్రమంగా పని చేయటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి నెలా 12వ తేదీలోపు మీటర్ రీడింగులు నమోదు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. కొత్త సాఫ్ట్వేర్ సక్రమంగా పని చేయకపోవటం వల్ల 50 శాతం కూడా పూర్తికాని పరిస్థితి నెలకొంది. సిబ్బంది మీటర్ వద్దకు వెళ్లినప్పటికీ రీడింగ్ నమోదు కాకపోవడంతో సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. సకాలంలో మీటర్ల రీడింగ్ నమోదు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో స్లాబ్ రేట్ పెరిగి అదనపు ఆర్థిక భారం పడుతుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఎలక్ట్రికల్ ఏఈఈ త్రినాథరావును వివరణ కోరగా, కొత్త సాఫ్ట్వేర్ వల్ల మొదటిలో సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటాయి. సకాలంలో రీడింగ్ నమోదు కానందున వినియోగదారులపై భారం పడకుండా వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు.


