అల్లిపురం: న్యాయవ్యవస్థలో అడ్వకేట్ క్లర్కుల పాత్ర ఎంతో కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఇటీవల మరణించిన సీనియర్ అడ్వకేట్ క్లర్క్ కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణ సుదీర్ఘంగా 53 సంవత్సరాల పాటు గుమస్తాగా అందించిన సేవలను కొనియాడారు. అలాగే న్యాయవాదులు, అడ్వకేట్ క్లార్కుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఎం.కె. శ్రీనివాసరావు, ఎస్. నాగేశ్ కుమార్ మాట్లాడుతూ.. అడ్వకేట్ క్లర్కుల సంక్షేమానికి తమవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. క్లర్కుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తామని తెలిపారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో క్లార్కుల సంక్షేమం, హక్కులు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. కార్యక్రమంలో విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నమ్మి సన్యాసిరావు, సీనియర్ న్యాయవాదులు బెవర సత్యనారాయణ, కే. సురేష్ కుమార్, గుమస్తాల సంఘం అధ్యక్షుడు పిల్ల బంగారు నాయుడు, కార్యదర్శి నల్ల భాస్కర రావు, ఏపీ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సభ్యులు జి. శివకృష్ణ, గొర్లి కృష్ణతో పాటు పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, అడ్వకేట్ క్లర్కులు పాల్గొని నివాళులర్పించారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు


