రావికమతం: మండలంలో మరుపాక శివారు దాసరయ్యపాలెంలో ఆదివారం పాముకాటుకు గురై రెండు పాడి ఆవులు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. దాసరయ్యపాలెం గ్రామానికి చెందిన వేపాడ సత్తిబాబు రెండు పాడి ఆవులు ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. సత్తిబాబు ఆదివారం కూలీ పనికి వేరే ప్రాంతానికి వెళ్లగా భార్య కొండమ్మ ఆవులను మేతకు తోలుకెళ్లింది. మధ్యాహ్నం ఆవులను పశువుల పాక వద్దకు తోలుకొచ్చి దాణా పెట్టి ఇంటికి వెళ్లింది. సాయంత్రం కొండమ్మ పశువుల పాక వద్దకు రాగా అప్పటికే రెండు ఆవులు మృతి చెందడంతో కొండమ్మ ఏడుస్తూ కేకలు వేసింది. పాకకు సమీపంలో ఉన్న రైతులు పాక దగ్గరకు వచ్చి చూడగా పాము కరవడం వల్లనే ఆవులు చనిపోయి ఉండవచ్చు ఆని రైతులు తెలిపారు. ఆవుల మృతి చెందిన సమాచారం గ్రామ సచివాలయం పశువైధ్యాధికారి సత్యనారాయణకు తెలియపర్చగా ఆయన వచ్చి ఆవులను పరీశీలంచగా పాము కాటుకు మృతి చెందాయని నిర్ధారించారు. జీవనాధారమైన రెండు ఆవులు రూ.1లక్ష 40 వేలు విలువ చేస్తాయని, అప్పులు చేసి ఆవులు కొని జీవనం సాగిస్తున్నామని రైతు సత్తిబాబు, భార్య కొండమ్మ కన్నీరు మున్నీరుగా విలపించారు.


