●తరతరాలుగా అదే బంధం
●వ్యవసాయం నుంచి కాఫీ సాగు వరకు..
●ప్రపంచం గుర్తించిన పంటలు
●మారుతున్న గిరిజన జీవితం
ప్రకృతిని వదలకుండా.. కాలంతో పాటు అడుగులు వేస్తున్న ఈ జీవితం వెనుక ఎన్నో ఆశలు, ఎన్నో కష్టాలు, ఎన్నో తరాల జ్ఞాపకాలు దాగున్నాయి. అడవిని కాపాడుకుంటూ.. అదే అడవితో తమ భవిష్యత్తును నిర్మించుకుంటున్న ఆదివాసీల జీవితం ఆందరికీ ఆదర్శం.
– సాక్షి, పాడేరు
కాలం మారుతున్నా.. అడవితో ఆదివాసీల అనుబంధం మాత్రం కొనసాగుతూనే ఉంది. సంప్రదాయ వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకున్న వారి జీవితం.. ఇప్పుడు క్రమంగా కొత్త మార్గాలను అందిపుచ్చుకుంటోంది. ఒకప్పుడు తమ అవసరాల కోసం సాగు చేసిన పంటలే.. నేడు వారి కుటుంబాలకు ఆదాయ మార్గాలుగా మారుతున్నాయి. కాఫీ తోటల్లో కష్టపడుతున్న రైతు చేతులు.. మిరియాల తీగలను అల్లుకుంటున్న కుటుంబాలు.. పసుపు, పిప్పలమోడి పంటలతో భరోసా వెతుక్కుంటున్న గిరిజన రైతులు.. మారుతున్న ఆదివాసీ జీవనానికి ప్రతిరూపాలుగా నిలుస్తున్నారు.
అడవిని చాలామంది ప్రకృతి సంపదగా చూస్తారు.. కానీ ఆదివాసీలకు మాత్రం అదే ఇల్లు.. అదే జీవనాధారం.. అదే బతుకుదెరువు. తరతరాలుగా అడవి తల్లితో మమేకమై జీవిస్తున్న వారి జీవితంలో చెట్టు, కొండ, వాగు, నేల.. ప్రతిదానికీ ఓ ప్రత్యేక స్థానం ఉంది. అడవిలో దొరికే ప్రతి వనరుతోనూ వారి బతుకు ముడిపడి ఉంది. చిన్ననాటి నుంచి అడవిని చూస్తూ పెరిగే పిల్లల నుంచి.. ఆ నేలపై చెమటోడ్చే రైతుల వరకు.. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రకృతి ఓ కుటుంబ సభ్యురాలిలానే మారిపోయింది.


