అరకులోయ టౌన్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 10వ తేదీ సోమవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు. ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఈ నెల 10న ఉదయం 10 గంటలకు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
చేస్తున్నట్లు చెప్పారు. పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ పర్యవేక్షణలో వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాజరై వేడుకలను ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆచార వ్యవహారాలు, జీవన విధానం, అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రతిబింబించేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. వేడుకల విజయవంతానికి వేదిక ఏర్పాటు, తాగునీరు, విద్యుత్, పార్కింగ్, భద్రత, ప్రజల సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.


